అందుకే సోనియాని అన్నాం, కెసిఆర్ని అన్లేదు: కొణతాల
విభజనకు కారకులైన కెసిఆర్ను, తెరాసను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అనలేదని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. దీనిపై కొణతాల స్పందించారు.
కెసిఆర్తో తమకు మ్యాచ్ ఫిక్సింగ్ అవసరం లేదన్నారు. తెలంగాణ కెసిఆర్తో వచ్చిందని తాము భావించడం లేదని, సోనియా ఇచ్చిందనుకుంటున్నామన్నారు. అందుకే ఆమెపై విమర్శలు చేస్తున్నామన్నారు.
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు. జెసి శనివారం జగన్తో అధిష్టానం కుమ్మక్కైనట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొణతాల స్పందిస్తూ జెసి ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు.
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విభజన ఒడంబడికలు చేసుకుంటున్నారని ఆరోపించారు. టిడిపి విభజనకు సిద్ధమైనా తమ పార్టీ సమైక్యవాదానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము భావిస్తున్నామని చెప్పారు. సమైక్య శంఖారావ సభను చేసి విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలన్నారు. విభజనకు వ్యతిరేకంగా తమ సభే తొలి అడుగు అన్నారు.