వైసిపికి షాక్, అంతా స్టంట్: జగన్ పాదయాత్రపై కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం పార్టీ నేతలతో భేటీ అయ్యారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం పార్టీ నేతలతో భేటీ అయ్యారు.
భేటీ అనంతరం వైసిపి నేతలు రోజా, మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు యాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పాదయాత్రకు వైసిపి సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో వైసిపి ఎంపీ పాదయాత్రపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు
అరకు వైసిపి ఎంపి కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. గురువారం ఆమె మాట్లాడారు. పాదయాత్ర చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి అవుతారంటే మూర్ఖత్వమేనని ఆమె విమర్శించారు.
Recommended Video
జగన్ పాదయాత్ర పొలిటికల్ స్టంట్
వైసిపి అధినేత జగన్ పాదయాత్ర పొలిటికల్ స్టంట్ అని, ఏపీకి ప్రత్యేక హోదా రాదని అప్పటి, ఇప్పటి నాయకులు అందరికీ తెలుసునని కొత్తపల్లి గీత వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు.
మా ఎంపీలు రాజీనామా చేస్తే అప్పుడు స్పందిస్తా
ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టేందుకు చేసిన వాగ్ధానమే ప్రత్యేక హోదా అని కొత్తపల్లి గీత అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించారు. వైసిపి ఎంపీల రాజీనామాల గురించి మూడేళ్లుగా చెబుతున్నారని, ఎంపీలు రాజీనామాలు చేస్తే అప్పుడు స్పందిస్తానని చెప్పారు.
నిన్న టిడిపితో సంబంధం లేదని
కాగా, ఇటీవల కొత్తపల్లి గీత టిడిపికి దగ్గరవుతున్నారనే ప్రచారం సాగింది. దానిపై ఆమె పదిహేను రోజుల క్రితం స్పందించారు. తనకు టిడిపితో ఎలాంటి సంబంధం లేదని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గిరిజన ప్రజాప్రతినిధులకు అన్యాయం చేస్తోందని ఆమె వాపోయారు.
అంతలోనే ఇలాంటి వ్యాఖ్యలా?
తాజాగా, హఠాత్తుగా కొత్తపల్లి గీత పార్టీ అధినేత జగన్ పాదయాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె నిజంగా చేశారా, లేక ఉత్తినే ప్రచారం జరుగుతోందా తెలియాల్సి ఉంది. తనకు టిడిపితో సంబంధం లేదని చెప్పిన కొద్ది రోజులకే జగన్ పాదయాత్ర స్టంట్ అని, పాదయాత్రతో సీఎం కాలేరని చెప్పడంపై చర్చ సాగుతోంది.