కర్నూలు జిల్లాలో పడగ విప్పిన ఫ్యాక్షన్
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ మరోమారు పడగ విప్పింది. కోడుమూరులో కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి ప్రధాన అనుచరుడు సిద్ధప్పను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. గోనెగండ్ల మండలం కున్నూరుకు చెందిన సిద్ధప్ప కోడుమూరులో తన అనుచరులతో కలిసి ఉండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఒక ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. .
2008లో దారుణహత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నేత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి కేసుతో పాటు కున్నూరు గ్రామంలో జరిగిన మూడు హత్యల్లో సిద్ధప్ప ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కొంతకాలంగా ఆయన కున్నూరు గ్రామాన్ని వదిలిపెట్టి కోడుమూరులో ఆశ్రయం పొందారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోడుమూరు ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
గతేడాది జూన్ లో కూడా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఫ్యాక్షన్ హత్య జరిగింది. ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, అన్నదమ్ములైన వడ్డు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హతమయ్యారు. అనుచరులతో కలిసి వెళుతుండగా ప్రత్యర్థి వర్గం దాడిచేసింది. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడిక్కడే మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. పాతకక్షల కారణంగానే హత్యలు జరిగినట్లు పోలీసులు తేల్చారు. తాజాగా సిద్ధప్ప కూడా దారుణంగా హతమవడంతో కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ఏమాత్రం తగ్గలేదని, నియంత్రించడానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలు కూడా శూన్యమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.