చనిపోయే దాకా ఉందామనుకున్నా, కానీ..: కోట్ల
కర్నూలు: చనిపోయే దాకా కాంగ్రెస్లోనే ఉండాలనుకున్నానని, కానీ లోక్సభలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులపై దాడి జరిగిన తర్వాత అసలు కాంగ్రెస్లో ఎందుకున్నానా అని అనిపిస్తోందని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. లోకసభ ఘటన తర్వాత ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ను ఛీకొడుతున్నాఆయన అన్నారు. శుక్రవారం కర్నూలులోని జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లో పార్టీని కాంగ్రెసు అధిష్టానం ఎందుకు నాశనం చేయాలనుకుంటోందో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. పోడియం వద్దకు వెళ్లిన వారందర్నీ సస్పెండ్ చేయకుండా కేవలం సీమాంధ్ర ఎంపీలనే ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని ఆయన అడిగారు. లోక్సభలో కాంగ్రెస్ పెద్దలు ఘోరంగా ప్రవర్తించారని ఆయన విమర్శించారు.
సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు కూడా చెప్పనీయకుండా ఆ ప్రాంత ప్రజాప్రతినిధులపై దాడికి దిగడం అరాచకమని కోట్ల అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ అనైతికంగా వ్యవహరించిందని తప్పు పట్టారు. లోక్సభలో టీ బిల్లు పెట్టినట్లు కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారని, కానీ ఆ సమయంలో హోం మంత్రి చేతిలో అసలు బిల్లు ప్రతులే లేవని, అలాంటప్పుడు బిల్లు ఎలా పెట్టినట్లవుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ముందస్తు ప్రణాళికతోనే పార్లమెంటులో వ్యవహరించిందని అన్నారు. ఈ విషయం తెలిసే ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే తెచ్చుకున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్రెడ్డిపై ఇతర రాష్ట్ర ఎంపీలు దాడికి దిగిన సమయంలో లగడపాటి అడ్డం వచ్చినందుకు కొందరు ఎంపీలు ఆయనపైనా దాడిచేసి కొట్టారని కోట్ల అన్నారు. ఆ సమయంలో స్ప్రే వాడడం సమంజసమేనని కోట్ల తెలిపారు.
మోదుగుల కేవలం మైకు విరిచి దాంతో పొడుచుకోబోయారే తప్ప ఆయన వద్ద కత్తిలేదని, ఇందుకు తానే ప్రత్యక్షసాక్షినని కోట్ల అన్నారు. వాస్తవాలు తెలుసుకునే ధైర్యం కమలనాథ్కు ఉంటే ప్రొసీడింగ్స్ బయటపెట్టాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ లోక్సభ ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు.