అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండాలా: 'రాహుల్ సభ'పై కోట్ల నిలదీత, బుజ్జగింపు
కర్నూలు: ఇన్ని అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండాలా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తనను బుజ్జగించేందుకు వచ్చిన సొంత పార్టీ నేతలను ప్రశ్నించారు. మంగళవారం నాడు రాహుల్ గాంధీ సమావేశంలో ఆయనను వేదిక పైకి రానివ్వలేదు.
దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వేదిక పైకి తనను అనుమతించకపోవడంపై తాను తీవ్ర మనస్తాపం చెందినట్లుగా ఆయన పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. కోట్ల మనస్తాపానికి గురయ్యాడన్న విషయం తెలుసుకొని ఏపీ నేతలు కొందరు ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు.
మంగళవారం రాత్రి అర్ధరాత్రి దాకా ఏపీ పార్టీ నేతలు పల్లం రాజు, కాసు వెంకట కృష్ణా రెడ్డి, కనుమూరి బాపిరాజు తదితరులు కోట్లతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయితే, అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండాలా అని ఆయన వారిని నిలదీశాడని తెలుస్తోంది.

లద్దగిరిలో కోట్లతో వారు అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఈ చర్చల నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కార్యకర్తలతో తన సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే, బుజ్జగింపులైనా తగ్గలేదని తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి తన కార్యకర్తలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.
వారి బుజ్జగింపులు పని చేస్తాయా లేక కార్యకర్తలతో మాట్లాడి పార్టీని వీడుతారా అనేది ఆ తర్వాతే తెలుస్తుందంటున్నారు. మంగళవారం రాహుల్ గాంధీ పర్యటనలో కోట్ల పేరు లేకపోవడంతో.. భద్రతా సిబ్బంది అతనిని వేదిక పైకి అనుమతించలేదు. దీంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
పార్టీ మారను: కోట్ల
తాను పార్టీ మారే ప్రసక్తి లేదని బుధవారం మధ్యాహ్నం కోట్ల చెప్పారు. రాహుల్ గాంధీ సభలో తనకు తీవ్రమైన అవమానం జరిగిందన్నారు. నేనే కాదు చాలామంది ముఖ్యనేతలు అవమానం పాలయ్యారన్నారు. అయితే, చివరలో కార్యకర్తల సూచన మేరకు నడుచుకుంటానని ట్విస్ట్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications