ఏపి సీఎస్ కృష్ణారావుకు అరుదైన గౌరవం: లండన్ సదస్సులో అవార్డు ప్రదానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు అరుదైన గౌరవం దక్కింది. లండన్లో ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరం నిర్వహించిన మేకిన్ ఇండియా సెమినార్లో సంస్థ ప్రతినిధులు ఐవిఆర్ కృష్ణారావుకు అవార్డును అందజేశారు. 4వ తేదీన లండన్ వెళ్లిన కృష్ణారావు మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు.
రైల్వే పనులపై సీనియర్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన లండన్ పర్యటన విశేషాలను వెల్లడించారు. భారత్లో పెట్టుబడులు ప్రోత్సహించేందుకు ‘మేకిన్ ఇండియా'ను ప్రచారంలోకి తేవడంపై ఇండో యురోపియన్ బిజినెస్ ఫోరం ఈ సదస్సును నిర్వహించిందన్నారు.
ఇంగ్లాండ్ ఇంధన మంత్రి సందీప్ వర్మ చేతులు మీదుగా ఈ అవార్డును ప్రధానకార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు అందుకున్నారు. తనతో పాటు ఇండోరమ కార్పొరేషన్ ఫౌండర్ చైర్మన్ ఎస్పి లోహియా కూడా అవార్డు అందుకున్నారని ఐవైఆర్ తెలిపారు.

సామాజిక రంగానికి సంబంధించి చేపట్టిన అనేక కార్యక్రమాలతో పాటు పారిశ్రామిక ఔత్సాహికతను ప్రోత్సహించినందుకు ఈ అవార్డు తనకు దక్కినట్టు ప్రధానకార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు విపుల్ శర్మ, చార్టర్డ్ అకౌంటెంట్ సునీల్ గుప్త,క్రికెటర్ కపిల్దేవ్ సహా భారత్ బ్రిటన్లకు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు.
ఇది ఇలా ఉండగా, సమీక్ష సమావేశంలో నడికూడి-శ్రీకాళహస్తి మధ్య కొత్తగా రైల్వే లైను, ఇతర రైల్వే ప్రాజెక్టులపై ప్రధానకార్యదర్శి రైల్వే అధికారులతోనూ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతోనూ సచివాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రగతి సమీక్షలో ప్రధాని నరేంద్ర మోడీకి సైతం ఈ రైల్వే లైన్ల ప్రాధాన్యతను వివరించడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో కేంద్రం సైతం ముందుకు వచ్చిందని అంచనా కంటే ముందే రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని అన్నారు.












Click it and Unblock the Notifications