శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపండి.. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలపై కేఆర్ఎంబీ సీరియస్
ఏపీ,తెలంగాణ రాష్ట్రాలపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని తెలుగురాష్ట్రాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని చేయడాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తప్పుబట్టింది.
శ్రీశైలం జలాశయంలో అడుగంటిన నీటి నిల్వలు: ఏపీ, తెలంగాణాపై కృష్ణా బోర్డు ఆగ్రహం
ఐదు నెలల క్రితమే విద్యుత్ ఉత్పత్తి విషయంలో రెండు రాష్ట్రాల సిఎం కు లేఖ రాసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవద్దని సూచించింది. అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు తీరును మార్చుకోక పోవడంతో శ్రీశైలంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజి స్థాయికి చేరుకున్నాయని, భవిష్యత్తులో సాగునీరు, తాగునీటి కష్టాలు ఉండబోతున్నాయని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ రెండు తెలుగు రాష్ట్రాల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
శ్రీశైలం రిజర్వాయర్ లో 34.24 టీఎంసీల మేర మాత్రమే నీరు
ఈ సంవత్సరం మే నెల వరకు తెలంగాణ రాష్ట్రానికి మూడు టి.ఎం.సి లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆరు టిఎంసిలు తాగునీటి కోసం అవసరం ఉంటుందని పేర్కొన్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ లో 34.24 టీఎంసీల మేర మాత్రమే నీరు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పోటాపోటీగా ఇరు రాష్ట్రాలు నిండుకుండలా ఉండాల్సిన శ్రీశైలం జలాశయాన్ని నిండుకునేలా చేశారని కృష్ణా బోర్డు అసహనం వ్యక్తం చేసింది.
పోటాపోటీగా విద్యుత్ ఉత్పత్తి వల్లే శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ కి నీరు
215 టీఎంసీల సామర్థ్యం ఉండే చోట 35 టీఎంసీల డెడ్ స్టోరేజి స్థాయికి నీటి నిల్వలు అడుగంటిపోయాయని, అందుకు కారణం రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుత్ ఉత్పత్తి చేయడమేనని ఇరిగేషన్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న జల విద్యుత్ లో శ్రీశైలం వాటా 40 శాతంగా ఉంది. అత్యధికంగా శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐదు నెలల క్రితమే హెచ్చరిస్తూ లేఖ రాసిన కృష్ణా బోర్డు, ఆదేశాలు బేఖాతరు చేసిన తెలుగు రాష్ట్రాలు
అయితే ఈ పరిస్థితులను ముందే ఊహించిన కృష్ణా రివర్ బోర్డు ఐదు నెలల క్రితమే రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేస్తూ లేఖ రాసింది. తాగునీరు, సాగునీరు ప్రధాన అవసరాలని, అంతకంటే ఎక్కువగా విద్యుత్తు ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని పేర్కొంది. కానీ విద్యుత్ ఉత్పత్తి కోసమే నీటిని వినియోగించి, సముద్రంలోకి నీటిని వృధాగా వదిలేస్తున్నారని నాడు రాసిన లేఖలో పేర్కొంది. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశించింది. లేకుంటే భవిష్యత్తు కాలంలో సాగునీరు, తాగునీటికి ప్రజలకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
బోర్డు లేఖ తర్వాత కూడా 59 టిఎంసిల నీటి వినియోగం
అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ జల విద్యుత్ ఉత్పత్తిని సాగించాయి. ఫలితంగా శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. గత ఏడాది ఇదే సమయానికి 129. 78 టీఎంసీల నీరు ఉంటే, ఈ ఏడాది ప్రస్తుత నీటి నిల్వలు 34.24 టీఎంసీలకు పడిపోయాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు లేఖ రాసిన తర్వాత కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు 59 టిఎంసిల నీటిని జల విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
భవిష్యత్ లో నీటి కష్టాలు తప్పవంటున్న నిపుణులు
ఈ సంవత్సరం వెయ్యికి పైగా టీఎంసీల మేర వర్షాలు, వరదల సమయంలో శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో వచ్చినప్పటికీ ప్రస్తుత నీటి నిల్వలు డెడ్ స్టోరేజి స్థాయిలో ఉండటం భవిష్యత్తు నీటి కష్టాలను స్పష్టంగా చెబుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికైనా విద్యుత్ ఉత్పత్తి ఆపివేసి, తగిన చర్యలు తీసుకోకుంటే రానున్న ఎండా కాలంలో తాగునీటి సమస్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.