బీజేపీ, వైఎస్ పథకాలపై కేటీఆర్, సురేఖపై కిషన్ సెటైర్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ధ్వజమెత్తారు. అలాగే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాల పైన నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్సుమెంట్తో విద్యా వ్యవస్థ, ఆరోగ్యశ్రీతో వైద్య వ్యవస్థ దెబ్బతిన్నదని మండిపడ్డారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లా గ్రామాలలో పాఠశాలలు ఉండాలన్నారు.
భారతీయ జనతా పార్టీకి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) తప్ప మరొక అభ్యర్థి దొరకలేదా అని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలు కలిసి ఓ సమైక్యవాదిని బరిలోకి దింపాయని విమర్శించారు. అది బాబు గారి జగ్గారెడ్డి పార్టీగా బీజేపీ తయారైందని ధ్వజమెత్తారు. జగ్గారెడ్డికి డిపాజిట్ కూడా రాదన్నారు.

కిషన్ రెడ్డి ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర సమితి పైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీలు మారిన మైనంపల్లి హన్మంత రావును ఎన్నికల ముందు తెరాసలో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెరాసలో చేరితో పవిత్రులు.. బీజేపీలో చేరితే పాపులా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జైకొడితే తెలంగాణవాదులు జైకొట్టని వారు తెలంగాణ ద్రోహులా అని నిప్పులు చెరిగారు.
కొండా సురేఖ తెరాసలో చేరగానే పునీతమైనట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పైన విమర్శలు చేసే అర్హత తెరాసకు లేదని ధ్వజమెత్తారు. తెరాస గోబెల్స్ ప్రచారం చేస్తోందన్నారు. రాయలసీమ కోసం పట్టుబట్టిన మజ్లిస్తో ఎలా జత కలిశారన్నారు. జగ్గారెడ్డికి భూమి బద్దలైనట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మూణ్ణెళ్లలోనే అహంకారం వచ్చిందన్నారు. కేసీఆర్, తెరాస తప్ప ఎవరు ఉండవద్దా అని నిలదీశారు. బీజేపీ పైన నానా రభస ఎందుకన్నారు.












Click it and Unblock the Notifications