హైదరాబాద్పై డిగ్గీ, నీతి గురించి జగన్: కెటిఆర్ నిప్పులు
హైదరాబాద్: హైదరాబాదు పైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం మండిపడ్డారు. హైదరాబాద్లో పాలనపై డిగ్గీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయామా? లేక కాంగ్రెస్ పార్టీ విధానమా? స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిడబ్ల్యూసి తీర్మానంలో, కేంద్ర కేబినెట్ నోట్లో లేని విషయాన్ని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మండిపడ్డారు. అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లివచ్చిన వైయస్ జగన్, నీతి, నిజాయితీ గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు జగన్ అడుగడుగునా అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లివచ్చిన జగన్, నీతివంతమైన రాజకీయాలు కావాలంటూ చిలుకపలుకులు పలుకుతున్నాడని ఆయన దుయ్యబట్టారు.

వంద ఎలుకలను తిన్న పిల్లి కాశీకి వెళ్లిందన్న చందంగా జగన్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేసారు. జగన్, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే దీక్షలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికలు జరిగిన ఆరు నెలలకే తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే అర్ధరాత్రి నిర్ణయమన్న బాబు, ఇప్పుడేమో ఎన్నికలకు ఆరు నెలలు ఉండగా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని అంటున్నారని కెటిఆర్ గుర్తు చేశారు.
బాబు ఏమి మాట్లాడుతున్నారో, కనీసం ఆయనకైనా అర్థం అవుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన వచ్చాక బాబు ఢిల్లీలో దీక్ష చేస్తానని చెబుతున్నాడని, ఎందుకు చేస్తున్నాడో ఆ పార్టీ నాయకులకు కూడా అర్థం కావడం లేదన్నారు.












Click it and Unblock the Notifications