సీమాంధ్ర డైరెక్షన్: టాస్క్ ఫోర్స్ నివేదికపై కేటిఆర్ ఫైర్
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం తలెత్తే శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై విజయకుమార్ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ బృందం కేంద్రానికి ఇచ్చిన నివేదికపై తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. సీమాంధ్ర పెట్టుబడిదారుల దర్శకత్వంలో టాస్క్ ఫోర్స్ బృందం పర్యటన సాగిందని ఆరోపించారు.
టాస్క్ఫోర్స్ క్షేత్రస్థాయిలో పనిచేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. టాస్క్ఫోర్స్ తన నివేదికను ఏకపక్షంగా తయారు చేసిందని కేటిఆర్ ఆరోపించారు. గవర్నర్ గిరీ పేరుతో హైదరాబాద్పై సీమాంధ్ర పెట్టుబడిదారులు దాదాగిరి చేయాలనుకుంటే ఒప్పుకోమని ఆయన అన్నారు. హైదరాబాద్ను క్యాపిటల్ సిటీ ఆఫ్ స్కాంగా మార్చిన ఘనత సీమాంధ్ర పెట్టుబడిదారులదేనని విమర్శించారు. కుంభకోణాల కేసుల్లో ఇరుక్కున్న కొంత మంది పేర్లను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ఆయన చెప్పిన పేర్లలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, నిమ్మగడ్డ ప్రసాద, మోపిదేవి వెంకటరమణ తదితరుల పేర్లున్నాయి.

కొంతమంది సీమాంధ్ర నేతలతో సమావేశాలు జరిపి టాస్క్ఫోర్స్ వాటినే తమ నివేదికలో తీసుకున్నారని ఆయన అన్నారు. టాస్క్ఫోర్స్ నివేదిక వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే హైదరాబాద్ మహా నగరంగా ఉందని, 1935లో ప్రముఖ మ్యాగజైన్ టైమ్స్లో ఈ విషయంపై ఓ కథనం కూడా వచ్చిందని తెలిపారు. మరో ప్రముఖ పత్రిక ఔట్లుక్ కూడా హైదరాబాద్ నగరంపై కథనాలు రాసిందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారులను కింఛపరిచే విధంగా టాస్క్ఫోర్స్ నివేదిక ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉంటున్నారని, వారందరికి లేని భయం సీమాంధ్రులకే ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి దోపిడీ, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని.. ఇలాంటివి టాస్క్ఫోర్స్ దృష్టికి రాలేదా అని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్ నుంచి 75శాతం ఆదాయం వస్తుందని సీమాంధ్రులు చెబుతున్న మాటలు అవాస్తమవని అన్నారు. సీమాంధ్ర ప్రాంతం నుంచే 66వేల కోట్ల ఆదాయం వస్తోందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి విభజనకు సహకరించాలని కేటిఆర్ కోరారు. సీమాంద్రుల హక్కులను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు అఖిల పక్షం సమావేశానికి హాజరుకావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications