తొక్కిపెట్టేందుకే: 'మెట్రోరైలు'పై కేటీఆర్, లేఖపై ఎన్వీఎస్
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులో మెట్రో రైలు విషయంలో ఎల్ అండ్ టీ చేతులెత్తేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీని పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం స్పందించారు. మెట్రో రైలు పనుల పైన ఎల్ అండ్ టీ లేఖ రాసినట్లు తాను మీడియాలోనే చూశానని కేటీఆర్ చెప్పారు.
ఈ వార్తను కొందరు పని గట్టుకొని రాసినట్లుగా ఉందన్నారు. మెదక్ ఉప ఎన్నికల ఫలితాలను తొక్కిపెట్టేందుకే మెట్రోను వివాదం చేశారని ఆరోపించారు. ఈ అంశం పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందిస్తారని వ్యాఖ్యానించారు.
మీడియాలో వచ్చిన వార్తల పైన మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా స్పందించారు. మెట్రో రైలు పనులు ఎక్కడా ఆగలేదన్నారు. పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే, కొన్ని అభ్యంతరాలు ఉంటే, వాటి పైన చర్చిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి మెట్రో రాసిన లేఖ పాతదేనని చెప్పారు. ఎన్వీఎస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీవ్ శర్మను కలిశారు.
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు హైదరాబాదు మెట్రో రైలు విషయంలో ఎల్ అండ్ టీ షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తాము తప్పుకుంటామని తేల్చి చెప్పిందని, దీంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, మీరే నిర్వహించుకోండని కూడా చెప్పిందని, ఎల్ అండ్ టీ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ వీబీ గాడ్గిల్ హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి ఈ మేరకు ఓ లేఖ రాశారని వార్తలు వచ్చాయి.