తెలియదు, దేవినేని ఉమ ఇక మాజీయే: కెటిఆర్
హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నీటి మట్టం విషయంలో తమ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కెటి రామారావు విరుచుకుపడ్డారు. దేవినేని ఉమా మహేశ్వర రావు మాజీ మంత్రి కావడం ఖాయమని ఆయన అన్నారు.
దేవినేని ఉమామహేశ్వర రావు రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని ఆయన శనివారం మీడియాతో అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు జారీ చేసిన జీవోల గురించి దేవినేని ఉమా మహేశ్వర రావుకు తెలియదని, ఆ జీవోల డాక్యుమెంట్లు పంపిస్తున్నానని ఆయన అన్నారు.
అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్లో ఆయన పాలిస్టో పరిజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టును కట్టింది విద్యుదుత్పత్తి కోసం మాత్రమేనని ఆయన అన్నారు. ప్రాజెక్టులో 834 అడుగుల వరకు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చునని, ఆ మేరుకు నిబంధనలున్నాయని ఆయన చెప్పారు.

1996లో జీవో నెంబర్ 69ని విడుదల చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని ఆయన అడిగారు. తాము చెప్పిన అంశాలన్నీ జీవోలో ఉన్నాయని ఆయన అన్నారు. అవసరమైతే జీవో కాపీ దేవినేని ఉమామహేశ్వర రావుకు పంపిస్తామని ఆయన చెప్పారు.
శ్రీశైలం జలాశయం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేయడంతో వివాదం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా మంత్రులు విద్యుదుత్పత్తి నిలిపేయాలంటూ కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందుకు నిరాకరిస్తూ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల వివాదం ముదిరింది.












Click it and Unblock the Notifications