తొడలు కొట్టం, బెదరం: రేవంత్ రెడ్డిపై కెటిఆర్ వ్యాఖ్య
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు భూముల విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులకు మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి మాదిరిగా తాము తొడలు కొట్టబోమని, తమ పని తాము చేసుకుని పోతామని తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు.
రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని ఆయన శనివారంనాడు మీడియాతో అన్నారు. అక్రమ కట్టడాలపై తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గేమింగ్ సిటీ భూములపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కెటిఆర్ అన్నారు.
గేమింగ్ సిటీ ద్వారా 50 వేల ఉద్యోగాలు ఇప్పిస్తామని, భూముల విషయంలో ఏ విధమైన అక్రమాలు జరగలేదని ఆయన అన్నారు. అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి వాస్తవాలను గ్రహిస్తే మంచిదని ఆయన అన్నారు. డిఎల్ఎఫ్ భూములలోనూ అవకతవకలు లేవని ఆయన అన్నారు.
గత కొద్ది కాలంగా మెట్రో రైలు భూముల విషయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కెసిఆర్కు సన్నిహితుడైన రామేశ్వర రావుకు భూములు కేటాయించడానికి మెట్రో రైలుకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.