కెసిఆర్కు ఇంటిపోరు: కెటిఆర్ అలక, మంత్రివర్గ సమావేశానికీ డుమ్మా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణపై ఆయన కుమారుడు, మంత్రి కెటి రామారావు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. హైదరాబాదులో ఉండి కూడా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన గైర్హాజర్ అయ్యారు. కెసిఆర్పై అలక వహించిన కారణంగానే ఆయన మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కెసిఆర్కు ఇంటిపోరు ప్రారంభమైందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చారు. అయితే, మంగళవారం ఉదయం ఆయన రాజభవన్కు రాకపోవడం మాత్రం చర్చనీయాంశంగానే మారింది. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు మంత్రి పదవులు ఇవ్వడంపై కెటిఆర్ ఆసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి, పార్టీకోసం కష్టపడిన కొప్పుల ఈశ్వర్ వంటివారిని కెసిఆర్ విస్మరించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. మహిళలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం ఆయనకు నచ్చడం లేదని అంటున్నారు. మంత్రివర్గంలో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చినవారే ఎక్కువ మంది ఉండడం కూడా ఆయన అసంతృప్తికి కారణమని చెబుతున్నారు.
జంపింగ్లకు మంత్రి పదవి దక్కేలా లాబీయింగ్ జరిగిందని కెటిఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. శ్రీనివాస యాదవ్కు మంత్రి పదవి ఇవ్వడానికి అంతగా తొందరపడాల్సిన అవసరం ఏముందని కెటిఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాస యాదవ్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుందని, ఆరు నెలల్లోగా ఎన్నికలు జరిగితే అందులో తలసాని ఓడిపోతే, శాసనమండలికి ఎంపిక చేయాల్సి వస్తుందని, ఇంత కసరత్తు అవసరమా అని కెటిఆర్ అంటున్నట్లు చెబుతున్నారు.
కోటా పూర్తి కావడంతో ఇక మంత్రి వర్గ విస్తరణకు అవకాశం లేదు. ఒకవేళ కొత్తవారిని కెసిఆర్ మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటే పాతవారిని కొంత మందిని తొలగించాల్సి వస్తుంది. అయితే విధేయులకు, ముఖ్యమైన శాసనసభ్యులకు ఆయన కెసిఆర్ నామినేటెడ్ పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి వర్గ విస్తరణ అనంతరం జరిగిన మంత్రి వర్గ సమావేశానికి కూడా కెటిఆర్ హాజరు కాలేదు. కెటిఆర్ మినహా మిగతా మంత్రులంతా మంత్రి వర్గ సమావేశానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications