వైసీపీకి కొత్త ఊపు: చేరికలతో పార్టీకి ఫుల్ జోష్.. ముస్లిం నేతలే టార్గెట్?
వైసీపీ నంద్యాల ఉపఎన్నిక అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి సమక్షంలో ఇస్మాయిల్ పార్టీ కండువా కప్పుకున్నారు.
నంద్యాల: శిల్పా చక్రపాణిరెడ్డి చేరికతో వైసీపీకి కొత్త ఊపు వచ్చింది. శిల్పా బ్రదర్స్ ఇద్దరూ వైసీపీలోనే ఉండటంతో.. స్థానిక నేతలు కూడా పార్టీలో చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఇస్మాయిల్ నేడు పార్టీలో చేరారు.
వైసీపీ నంద్యాల ఉపఎన్నిక అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి సమక్షంలో ఇస్మాయిల్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు నాయకులు సైతం వైసీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే.
వైసీపీకి చిక్కక టీడీపీలోకి: డిసైడ్ చేసేది ముస్లింలే.. ఇదీ నంద్యాల 'రియాలిటీ'?
హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం పార్టీ అధినేత జగన్ సమక్షంలో సోషల్ డెమోక్రటిక్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు హబీబ్ ఉల్లా పార్టీలో చేరారు. పార్టీలోకి చేరికలు పెరుగుతుండటంతో నంద్యాల ఎన్నికలో గెలుస్తామన్న నమ్మకంతో వైసీపీ ఉంది.
జగన్ నాయకత్వం పట్ల వారిలో ఉన్న విశ్వాసమే పార్టీలో చేరికలకు కారణమని వైసీపీ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, నంద్యాలను గెలుపోటములను డిసైడ్ చేసేది ముస్లింలేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక్కడ ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉండటంతో.. ఆ వర్గంలోని పెద్దలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నంలో రెండు పార్టీలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ ఇంతియాజ్ అహ్మద్ ను టీడీపీ తమ పార్టీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వైసీపీలోకి ఇస్మాయిల్ చేరడంతో.. ఇరు పార్టీలు ముస్లిం పెద్దలకు గాలం వేస్తున్నాయన్న విషయం స్పష్టమవుతోంది.