వాచ్మెన్ ఉద్యోగం కోసం ఎమ్మెల్యే లెటర్! "వైసీపీ వాళ్లందరి ఉద్యోగాలు ఊడగొడతాం!"
రాష్ట్రంలో కూటమి వర్సెస్ వైసీపీ నేతల మధ్య నడుస్తున్న రాజకీయ సవాళ్లు ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. నిన్నటి వరకు రాయలసీమ ముఠా రాజకీయాలకే పరిమితమైన ఈ సెగలు.. ఇప్పుడు ప్రశాంతతకు మారుపేరైన ఉత్తరాంధ్రను, అందునా అమాయక గిరిజన బిడ్డలుండే పార్వతీపురం మన్యం జిల్లాను తాకాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీ క్యాడర్కు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించుకోవడం ఏపీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న 'మామూలు' తంతే. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన తర్వాత.. ఓ వాచ్మెన్ ఉద్యోగం చుట్టూ ఇరు పార్టీల అగ్రనేతలు తలపడటం, అది కాస్తా తీవ్ర వ్యక్తిగత విమర్శలకు దారితీయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
'సేవాదళ్' చిచ్చు.. లెటర్ హెడ్పై ఎమ్మెల్యే హుకుం!
ప్రకృతి రమణీయతతో, ప్రశాంతమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే కురుపాం నియోజకవర్గంలో ఈ పొలిటికల్ హై-డ్రామాకు తెరలేచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కురుపాం మార్కెట్ యార్డ్లో జీ. శ్రీనివాసరావు అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కోటాలో వాచ్మెన్గా చేరారు. ప్రభుత్వం మారినా ఆయన తన విధుల్లోనే కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల వైసీపీ విడుదల చేసిన సేవాదళ్ విభాగం జాబితాలో 'జీవీ శ్రీను' అనే పేరు కనిపించడంతో అసలు కథ మొదలైంది.

ఆ 'జీవీ శ్రీను' మరెవరో కాదు, మార్కెట్ యార్డ్ వాచ్మెన్ శ్రీనివాసరావేనని కూటమి నేతలు గుర్తించారు. అంతే.. కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి నేరుగా తన 'అఫీషియల్ లెటర్ హెడ్' పైనే సదరు ఉద్యోగిని తక్షణమే తొలగించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారిక లేఖతో ఒత్తిడి తెచ్చి మరీ ఆ చిన్న ఉద్యోగిని తీయించేశారంటూ వైసీపీ ఇప్పుడు తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
"వైసీపీ వాళ్లందరి ఉద్యోగాలు ఊడగొడతాం" - ఎమ్మెల్యే జగదీశ్వరి సంచలనం!
ఈ వివాదంపై మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అస్సలు తగ్గలేదు సరే కదా.. మరింత అగ్గి రాజేసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. "వైసీపీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి ఉద్యోగాలు ఊడగొడతాం" అంటూ ఆమె నేరుగా హెచ్చరించడం పొలిటికల్ సర్కిల్స్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇంతటితో ఆగకుండా మాజీ మంత్రి పుష్ప శ్రీవాణిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యక్తిగత విమర్శలకు దిగారు. "నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావో అక్కడ రాజకీయాలు చేసుకో.. నీ ముఖం చూసి ఇక్కడి ప్రజలు ఓట్లేయలేదు. శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, విజయరామరాజు గార్ల ముఖాలు చూసి ఓటేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి ఈ నియోజకవర్గానికి ఏం చేశావు?" అంటూ జగదీశ్వరి చేసిన ఘాటు వ్యాఖ్యలు హీట్ పెంచేశాయి.
సేవా దళ్ అనేదే లేదే..
అయితే కొసమెరపు ఏంటి అంటే వైసీపీలో అసలు సేవాదళ్ అనే విభాగం లేదు. తాజాగా ఈ విభాగం పేరుతో సర్కులేట్ అవుతున్న జాబితాలో ఉన్న జీవీ శ్రీనుకు, ఉద్యోగం కోల్పోయిన జీ శ్రీనివాస రావుకు కూడా సంబంధం లేకపొవడం ఇక్కడ అసలైన ట్విస్ట్. ఇదే విషయాన్ని జీ శ్రీనివాసరావు పై అధికారులకు ఇచ్చిన వివరణలో స్పష్టం చేశారు
కొత్త సంస్కృతికి తెర.. బలైపోతున్న యువత!
నిజానికి ఏపీ రాజకీయాల్లో ఇదొక సరికొత్త, ప్రమాదకరమైన సంస్కృతికి ఆధ్యం పోస్తోందనే చర్చ నడుస్తోంది. గతంలో రాజకీయ కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించాలనుకుంటే కేవలం మౌఖిక (ఓరల్) ఆదేశాలతోనే గుడ్ బై చెప్పేవారు. కానీ ఇప్పుడు నేరుగా ప్రజాప్రతినిధులే తమ అధికారిక లెటర్ హెడ్లను వాడుతూ, రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేస్తే ఉద్యోగాలు పీకేస్తామని లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇవ్వడం భవిష్యత్ పరిస్థితులకు అద్దం పడుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన ప్రతిసారీ కిందిస్థాయి ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. కురుపాంలో ఇరు పార్టీల నేతలూ 'తగ్గేదే లే' అన్నట్లు తలపడుతుండగా.. ప్రతిభ ఆధారంగా కాకుండా కేవలం ఎమ్మెల్యేల సిఫార్సలతో ఉద్యోగాలు ఇచ్చేస్తారా అనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇలా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే ఉన్నత చదువులు చదివిన వారికి సరైన అవకాశాలు లేకుండా పోతున్నాయి అని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications