‘మోడీ, బాబు హఠావో.. ఆంధ్రాకో బచావో’: కేవీపీ తీవ్ర వ్యాఖ్యలు, ధర్నా ఉద్రిక్తం, అరెస్టులు

హైదరాబాద్: ప్రధాన నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టిడిపి, బిజెపిలపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ ప్రత్యేక హోదాపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ, ఏపీ ప్రభుత్వం వాటిని అడ్డుకోవడం లేదంటూ సోమవారం ప్రకాశం బ్యారెజీ వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా నిర్వహించింది.

ధర్నాలో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, నేతల కిళ్లి కృపారాణి, దేవినేని నెహ్రూ, పళ్లంరాజు తదితరులతోపాటు కేవీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ.. హోదాపై, పునర్ వ్యవస్థీకరణపై బిల్లుపై కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

కేవీపీ

ఏపీకి రావాల్సిన నీళ్లు మళ్లిపోతున్నాయని ఆరోపించారు. మోడీ ఇచ్చిన ఛాయ్ తో చంద్రబాబు సమాధానపడ్తున్నారని మండిపడ్డారు. ఏపీకీ హోదా రాకపోతే కష్టాలు తప్పవని అన్నారు. అన్నమో రామచంద్ర, ఉద్యోగమో రామచంద్ర అనాల్సిందేని తేల్చి చెప్పారు. ఏపికీ జరుగుతున్న అన్యాయాలపై కాంగ్రెస్ అనేక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు.

మోడీ, బాబు లాలూచీకి తెరదించేందుకు బావసారూప్యత పార్టీలతో అవగాహన ఏర్పర్చుకుని ముందుకు సాగాలని సూచించారు. బిజెపి కేంద్ర మంత్రులు లాలూచీ కుస్తీలో భాగంగా ఏపీకి వస్తున్నారని, దీనికి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా డైరెక్షన్ చేస్తున్నారని తెలిపారు. ఇందులో చంద్రబాబు పాత్ర కూడా ఉందని అన్నారు.

'మోడీ, చంద్రబాబు హఠావ్.. ఆంధ్రా బచావో' అని కేవీపీ తీవ్రమైన నినాదాలిచ్చారు. అంతేగాక, 'టిడిపి, బిజెపి హఠావ్.. ఆంధ్రాకో బచావ్' అని కేంద్రమంత్రులకు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. భావి తరాల కోసం త్యాగాలు చేయాలని, అందుకు ప్రణాళిక అవసరమని చెప్పారు.

మాజీ స్పీకర్‌ మనోహర్ హౌజ్ అరెస్ట్

గుంటూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ఏపీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. మనోహర్‌ను ఆయన నివాసంలో నిర్బంధించారు.

కేసీఆర్ అంటే ఎందుకంత భయం: రఘువీరా

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల‌కు నిర‌స‌న‌గా విజ‌య‌వాడ‌లో కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తోన్న ధ‌ర్నాలో ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి సీఎం చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. 'గోదావ‌రి, కృష్ణా డెల్టాల్లో తాగునీరు లేదు, గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు దాటే ప‌రిస్థితి ఏపీలో ఉంది' అని ఆయన అన్నారు.

ఏపీలో ఏర్ప‌డ్డ క‌ర‌వుపై, తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టుల‌పై చంద్ర‌బాబు నాయుడు ఇంత‌వ‌ర‌కూ నోరు తెర‌వలేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. తెలంగాణ నిర్మిస్తోన్న పాల‌మూరు, డిండి ప్రాజెక్టులపై చంద్ర‌బాబు తీవ్ర నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని ఆయన అన్నారు.

'ముఖ్య‌మంత్రి గారూ.. మీ ఊళ్లో కూడా ఈరోజు తాగ‌డానికి నీళ్లు లేవు' అని రఘువీరా అన్నారు. 'ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చ‌డానికే 'జ‌న్మ‌భూమి' అని నినాదమిస్తోన్న మీ ప్ర‌భుత్వం పుట్టిన భూమికే అన్యాయం చేస్తోంది' అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

'పంట‌లెండిపోయాయ్‌, నీళ్లు క‌ర‌వైపోయాయ్.. కృష్ణా, తుంగ‌భ‌ద్ర మీద తెలంగాణ అక్ర‌మ నిర్మాణాలు చేస్తోంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే ప్ర‌జ‌లకి గుక్కెడు నీళ్లు కూడా అంద‌వు'ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 'చంద్ర‌బాబు గారూ.. కేసీఆర్ అంటే ఎందుకంత భ‌యం..? నోటుకు ఓటు కేసుపై భ‌య‌ప‌డుతున్నారా.?, మీరు జైలుకు వెళతారని భావిస్తున్నారా..? అని ర‌ఘువీరా వ్యాఖ్యానించారు.

బ్యారేజ్ కు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

విజయవాడలో కాంగ్రెస్ పార్టీ సోమవారం చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అలంకార్ సెంటర్ లో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ నేతలు, ఆపై ప్రకాశం బ్యారేజీని ముట్టడించాలని బయలుదేరగా, వారిని ఏలూరు రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, పోలీసు అధికారుల మధ్య వాగ్వాదం జరుగగా, కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

పలు చోట్ల బారికేడ్లను అడ్డు పెట్టినప్పటికీ, కాంగ్రెస్ నేతలు వాటిని దాటుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. బ్యారేజీకి సమీపంలోకి వచ్చిన తరువాత ఓ దశలో పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని నలువైపులా చెదరగొట్టి, కేవీపీ, రఘువీరా రెడ్డి, కిల్లి కృపారాణి, దేవినేని నెహ్రూ తదితరులను అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. తాము ప్రజల కోసం పాటుపడుతుంటే, అరెస్ట్ లు చేయడం దుర్మార్గమని ఈ సందర్భంగా రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. తదుపరి తాము మరింత పెద్దఎత్తున ఉద్యమించనున్నామని తెలిపారు.

ఆర్డీఎస్ వద్ద ఉద్రిక్తత

కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసలూరులోని ఆర్డీఎస్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీఎస్‌ ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీఎత్తున మోహరించారు.

ఏపీ ఒప్పుకోకుండా తెలంగాణ, కర్ణాటక ఎలా పనులు మొదలుపెడతాయని బాలనాగిరెడ్డి ప్రశ్నించారు. కర్ణాటకతో కోట్లాడి ఏపీ ప్రజల ప్రయోజనాలు కాపాడతామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+