బుజ్జగింపులు, బెదిరింపులు: రంగంలోకి కెవిపి, ఫోర్జరీ..!
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో రాజ్యసభ పోరు రసవత్తరంగా మారింది. రెబల్ అభ్యర్థులను బరిలో నుండి తప్పించేందుకు కెవిపి రామచంద్ర రావు రంగంలోకి దిగారు. రెబల్స్కు మద్దతిచ్చిన శాసన సభ్యులు, మంత్రులతో కెవిపి, ఆయన వర్గం చర్చలు జరుపుతోంది. మంత్రి గంటా శ్రీనివాస రావును కెవిపి బుధవారం అసెంబ్లీ లాబీల్లో కలిశారు.
చైతన్య రాజును బరిలో నుండి తప్పించాలని కోరారు. మంత్రి దానం కూడా ఈ విషయమై అడిగారు. దానికి గంటా స్పందిస్తూ... పార్టీ నాలుగో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. నాలుగో అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవకాశాలున్నా ఎందుకు నిలబెట్టలేదని ఆయన అన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చాంబర్లోను కెవిపి పలువురు నేతలతో భేటీ అయి సంప్రదింపులు జరుపుతున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని కూడా బుజ్జగిస్తున్నారు.
మరోవైపు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మంత్రి కొండ్రు మురళిలు రెబల్స్కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెబల్స్ పైన, వారికి మద్దతిచ్చే వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చైతన్య రాజుకు మద్దతు పలికిన వారు వెంటనే ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. అధిష్టానం కూడా దీనిపై ఆరా తీస్తోంది. కెవిపి ముఖ్యమంత్రిని కూడా కలిశారు.
కాగా, రాజ్యసభకు నామినేషన్ వేసిన చైతన్య రాజుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి ఫోన్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని సూచించారట. అయితే అందుకు చైతన్య రాజు అంగీకరించలేదని తెలుస్తోంది.
ఫోర్జరీ..
పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేఖ రాశారు. రెబల్ అభ్యర్థులకు మద్దతిచ్చిన సంతకాలు ఫోర్జరీ అయ్యాయనే అనుమానాలు ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. సంతకాలు పెట్టారని భావిస్తున్న వారితో నేరుగా మాట్లాడాలని కోరారు.