విజయమ్మ ఆత్మీయ సభ: తేల్చేసిన కేవీపీ-గండి కొడుతున్నారా : హాజరయ్యేది ఎవరెవరంటే..!!
వైఎస్సార్ వర్దంతి ఈ రోజు. కొంత కాలంగా దూరంగా ఉన్న సీఎం జగన్ - షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపుల పాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ప్రార్ధనల్లో పాల్గొన్నారు. అయినా.. నాటి అనుబంధం మాత్రం ఆ సమయంలో కనిపించలేదు. ఇక, ఇప్పుడు అందరూ ఈ సాయంత్రం విజయమ్మ నిర్వహించనున్న వైఎస్సార్ ఆత్మీయ సదస్సు పైన రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది. ఇది రాజకీయ సమావేశం కాదని..కేవలం ఆత్మీయ సమావేశమని చెబుతున్నా...ఎవరి కోణంలో వారు దీని పైన విశ్లేషణలు చేస్తున్నారు.
విజయమ్మ సభకు కేవీపీ హాజరు..
ఇక, వైఎస్సార్ ఆత్మ...ఆ కుటుంబానికి అత్యంత ఆప్తుడు అయిన కేవీపీ రామచంద్ర రావు ఈ సమావేశం పైన స్పందించారు. విజయమ్మ నుంచి తనకు ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం అందిందని చెప్పారు. తాను హాజరవుతున్నట్లు స్పష్టం చేసారు. అదే సమయంలో ఆత్మీయ సమ్మేళనం ఎందుకు ఏర్పాటు చేసారనేది విజయమ్మే చెప్పాలంటూ కేవీపీ వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా కేవీపీ అసలు విషయం తేల్చి చెప్పారు. వైఎస్ కాంగ్రెస్ మనిషి అంటూ స్పష్టం చేసారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు.
వైఎస్సార్ కాంగ్రెస్ వ్యక్తి అంటూ...
వైఎస్ కుటుంబానికి అత్యంత అప్తుడిగా ఉన్నప్పటికీ..ఏపీలో జగన్ ప్రమాణస్వీకారం తరువాత ఆయన ఏ రోజు సీఎం జగన్ ను కలవలేదు. అదే విధంగా వైఎస్ కుటుంబ సభ్యులను కలిసిన దాఖలాలు లేవు. ఇప్పుడు విజయమ్మ నుంచి ఆహ్వానం అందటంతో వెళ్లాలని నిర్ణయించారు. ఇదే సమయంలో..గాంధీ భవన్ లో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తొలి సైతం వైఎస్సార్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. దీంతో..అసలు విజయమ్మ ఏర్పాటు చేసిన సమావేశం ఉద్దేశం పైన చర్చ మొదలైంది.
విజయమ్మ ఉద్దేశానికి కేవీపీ గండి కొడుతున్నారా
తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో వైఎస్సార్ ఆత్మీయుల పేరుతో ఆయన సన్నిహితులను ఒక చోటకు చేర్చటం ద్వారా మరో సారి వైఎస్సార్ అభిమానుల్లో ఆయన్ను స్మరించుకొనేలా చేయాలని..తద్వారా షర్మిల రాజకీయ భవిష్యత్ కు మేలు చేస్తుందనేది ఈ సమావేశం వెనుక ఉద్దేశంగా ప్రచారం సాగుతోంది. దీనిని గుర్తించిన కేవీపీ ఉద్దేశ పూర్వకంగానే ఈ సమావేశానికి కొద్ది గంటల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ మనిషి అని చెప్పటం ద్వారా..ఆయన అభిమానులు కాంగ్రెస్ వైపే ఉండేలా వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేసారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వైఎస్సార్ ఇమేజ్ ఓన్ చేసుకొనేందుకేనా..
తెలంగాణలో వైఎస్సార్ అభిమానుల మద్దతు కోసం ఒక విధంగా షర్మిల- రేవంత్ మధ్య పోటీ ఉంది. వైఎస్సార్ కుమార్తెగా..తనకే తండ్రి మద్దతుదారుల నుంచి సపోర్ట్ ఉంటుందని షర్మిల భావిస్తున్నారు. అయితే, రేవంత్ తొలి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ నేత అని చెబుతూ...ఆయను అభిమానించే వారంతా కాంగ్రెస్ తోనే ఉంటారని చెబుతూ వచ్చారు. దీంతో..ఇప్పుడు విజయమ్మ ఇటువంటి సమావేశాల ద్వారా వైఎస్సార్ ఇమేజ్ ను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇ
అన్ని రంగాల ప్రముఖులకు ఆహ్వానం..
ఇక, ఈ సాయంత్రం..హైటెక్స్ నోవాటెల్ హోటల్లో వైఎస్ సంస్మరణ సభ వైఎస్ విజయమ్మ సారథ్యంలో జరగనున్న ఈ సభలో 350 మంది అతిథులకు ఆహ్వానం అందింది. తెలంగాణ రాజకీయ పార్టీల నుంచి 88 మందికి ఆహ్వానం అందగా.. ఏపీ నుంచి 44 మంది నేతలను విజయమ్మ ఆహ్వానించారు. సినిమా రంగం నుంచి 40 మంది ప్రముఖ నటులకు ఆహ్వానం అందగా.. 18 మంది ప్రముఖ వ్యాపార వేత్తలకు,16 మంది వైద్యులు, 17 మంది సామాజిక వేత్తలు, వైఎస్ హయాంలో పని చేసిన మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ జడ్జీలకు ఆహ్వానం అందింది.
విజయమ్మ-షర్మిల స్పీచ్ పైనే ఆసక్తి..
కాగా.. వేదిక మీద 33 మంది ముఖ్యులు ప్రసంగించనున్నారు. అందులో నాడు వైఎస్ తో సన్నిహితంగా మెలిగి..ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న వారు సైతం ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో పలువురికి ఆహ్వానం అందగా..చిరంజీవి, మోహన్ బాబు, క్రిష్ణ, జయసుధ, జీవిత వంటి వారు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దీంతో..విజయమ్మ సమావేశంలో ఏపీ నుంచి పాల్గొనే నేతలెవరనే దాని పైన ఆసక్తి కంటిన్యూ అవుతోంది. అయితే, సభలో విజయమ్మ -షర్మిల ఏం చెబుతారనేదే ఇప్పుడు ఆసక్తి కర అంశంగా మారుతోంది.