ఏడాది తర్వాత జ్ఝానోదయమైందా: జైట్లీపై కెవిపి మండిపాటు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రతిపాదిస్తూ తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వైఖరిపై కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఇది మనీ బిల్లు అంటూ ఏడాది తర్వాత జ్ఞానోదయమైందా అని ఆయన అడిగారు.
బిల్లుపై జరిగిన రభసతో రాజ్యసభ వాయిదా పడిన తర్వాత ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతికి పంపించే ముందే అది మనీ బిల్లు అనే విషయం చెప్పాల్సి ఉండిందని ఆయన అన్నారు. నిరుడు ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత సభలో చర్చ కూడా జరిగిందని ఆయన గుర్తు చేశారు.
ఈ స్థితిలో అది మనీ బిల్లు కాబట్టి స్పీకర్ అనుమతితో లోకసభలో ప్రవేశపెట్టాలని అనడం సరి కాదని ఆయన అన్నారు. తమ హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు.
ఏపీని బీజేపీ సమాధి చేయాలని భావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి బీజేపీ కుట్రపూరితంగా కేంద్రం అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. బిల్లును మనీ బిల్లు అంటూ వక్రభాష్యం చెప్పడం ద్వారా బీజేపీ నేతలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
బీజేపీ కుయుక్తులను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని కెవిపి అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం తాము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేశామని, బీజేపీ ప్రజలను మోసం చేసిందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా బిల్లును ద్రవ్య బిల్లుగా ప్రకటించడం ద్వారా ఈ బిల్లును రాజ్యసభలో ఓటింగ్ కు రాకుండా బీజేపీ అడ్డుకోగలిగిందని ఆయన తెలిపారు.