మోడీని ఇరకాటంలో పడేసిన కేవీపీ: టార్గెట్ 2019 రివర్స్ అవుతోందా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరుకున పడిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
కేవీపీ బిల్లుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు, జాతీయస్థాయిల కొన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఏపీలో మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ కూడా కేవీపీ బిల్లుకు మద్దతు పలుకుతామని చెప్పింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇరుకున పడిందని చెప్పవచ్చునంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా నష్టపోయింది. తెలంగాణలోను ప్రతిపక్షానికి పరిమితమయింది. ఏపీలో ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించకుండా పోయింది. ఇలాంటి సమయంలో ప్రత్యేక హోదా, కేంద్రం హామీలు ఆ పార్టీకి కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి.
మోడీని ఇరికించిన కేవీపీ
కాంగ్రెస్ పార్టీ డిమాండుకు ఇప్పుడు తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలకుతుండటం గమనార్హం. ఇది కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చే అంశమేనని చెప్పవచ్చు. కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లుకు మద్దతు ఇచ్చి, ఆ క్రెడిట్ మీరే తీసుకోవాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి చెప్పారు. ఆయన అలా చెప్పినప్పటికీ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి దక్కడం ఖాయం.
మోడీని ఇరికించిన కేవీపీ
అలాగే, మద్దతిచ్చిన పార్టీగా టిడిపి, వైసిపిల పైన అనుకూలత ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో బీజేపీ ఇరుకున పడిపోయినట్లే అంటున్నారు. 2019 ఎన్నికల నాటికి ఏపీలో టిడిపి, వైసీపీలకు ధీటుగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. కానీ, కేవీపీ తెచ్చిన ప్రయివేటు మెంబర్ బిల్లు ఆ పార్టీని పూర్తిగా ఇరకాటంలో పడేసింది.
మోడీని ఇరికించిన కేవీపీ
ఏపీలో టిడిపి మిత్రపక్షమైనప్పటికీ.. పార్టీ ఎదుగుదల కోసం చంద్రబాబు పాలన పైన బిజెపి విమర్శలు కూడా గుప్పిస్తోంది. పలు ప్రశ్నలు సంధిస్తోంది. 2019లో బీజేపీదే అధికారం అని కొద్ది రోజుల క్రితం బీజేపీ నేతలు ప్రకటించారు. ఇప్పుడు మాత్రం కథ రివర్స్ అయిందని చెబుతున్నారు.
మోడీని ఇరికించిన కేవీపీ
విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా గురించి బీజేపీ గట్టిగా డిమాండ్ చేసి ఏపీ ప్రజలలో సానుభూతి పొందింది. ఇప్పుడు అదే హోదా గురించి కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తోంది. కేవీపీ బిల్లుకు టిడిపి, వైసిపి నుంచి మద్దతు లభించిన విషయం తెలిసిందే.