బిక్ష పెట్టిన ఇందిరాకే ఇలా చేస్తావా, భయమేస్తోంది: బాబును దులిపేసిన కేవీపీ
స్వర్గీయ ఇందిరా గాంధీ.. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టారని, ఎమ్మెల్యేగా, మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో చేశారని, రాజకీయ జీవితం ఇచ్చిన ఇందిర పేరునే పోలవరం ప్రాజెక్టుకు తీసివేస్తారా అని కేవీపీ రామ
విజయవాడ: స్వర్గీయ ఇందిరా గాంధీ.. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టారని, ఎమ్మెల్యేగా, మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో చేశారని, రాజకీయ జీవితం ఇచ్చిన ఇందిర పేరునే పోలవరం ప్రాజెక్టుకు తీసివేస్తారా అని కేవీపీ రామచంద్ర రావు మంగళవారం మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు పైన ఏపీ సర్కారు అన్నీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టులో టిడిపి పాత్ర ఒక్కశాతం కూడా లేదని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారని, ఎవరు కలలు కన్నారో చెప్పాలని నిలదీశారు.
ఆయన రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారని, ఆ తర్వాత స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన టిడిపిలో చేరారని, ఆయన ఈస్థాయికి ఎదగడానికి ఇందిరా గాంధీయే కారణమన్నారు. అలాంటి ఇందిర పేరును పోలవరం ప్రాజెక్టు పేరు నుంచి తొలగించడం ఏమిటన్నారు. మీ అక్రమాలను రాక్షసులు, దుర్మార్గులు అంటారా అన్నారు.
నీకు భిక్ష పెట్టిన ఇందిరమ్మను మరుస్తావా
మహాతల్లి ఇందిరమ్మ పేరును పోలవరం ప్రాజెక్టు నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. ఆ మహాతల్లి ఇందిర నీ పైన కురిపించిన దయదాక్షిణ్యాలకు ఇదా మీరు ఆమెకు చేసిన ఉపకారం అని చంద్రబాబును నిలదీశారు.
చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేయవద్దన్నారు. స్వాతంత్రానికి ముందే పోలవరంకు ప్రయత్నాలు జరిగాయన్నారు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఆ రోజున ఉన్న కృష్ణ అయ్యంగార్ నుంచి కేఎల్ రావు ఆలోచనల నుంచి వచ్చిన ప్రాజెక్టు అన్నారు.
అప్పుడు నీవు ఉన్నావుగా..
అంజయ్య కేబినెట్లో చంద్రబాబు సహాయ మంత్రిగా ఉన్నారని, అప్పుడు పోలవరం గురించి మర్చిపోయారా అని ప్రశ్నించారు. 1983 నుంచి పరిపాలన చేసింది ఎవరని నిలదీశారు. ఈ 21 ఏళ్లలో అయిదేళ్లు తప్ప మీరు లేదా మీ కనుసన్నుల్లో నడిచిన టిడిపి ప్రభుత్వం ఉందన్నారు.
చంద్రబాబుకు అల్జీమర్స్.. భయపడుతున్నా
ఇన్నేళ్లలో ఎప్పుడైనా మీరు పోలవరం మాటను ఉచ్చరించారా అని నిలదీశారు. రికార్డుల్లో చూపించగలరా అన్నారు. చంద్రబాబు అల్జీమర్స్తో బాధపడుతున్నారా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు సరైన వైద్యం కావాలన్నారు. చంద్రబాబు వ్యాధి పైన భయమవుతోందన్నారు.
పోలవరం విషయంలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి తమ పార్టీ (కాంగ్రెస్) కోటి సంతకాల సేకరణ చేపట్టిందని, ఆ సంతకాల సేకరణ పోలవరం వద్ద ప్రారంభించిందని గుర్తు చేశారు.
నా సంతకం రెండోది
ఆ సంతకాలలో తనది రెండో సంతకం అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతికి గుర్తు చేసేందుకే తాము అక్కడే కోటి సంతకాల సేకరణ ప్రారంభించామన్నారు. చంద్రబాబుకు రాజకీయ బిక్ష పెట్టిందే ఇందిరా గాంధీ అన్నారు. ఆమె పేరును ప్రాజెక్టు పేరు నుంచి తీసేశారన్నారు.
చంద్రబాబు సాధించింది రూ.18వందల కోట్ల చిల్లర
పోలవరం ప్రాజెక్టు తన గొప్ప అని చెప్పుకున్న చంద్రబాబు.. సాధించింది ఏమిటని ప్రశ్నించారు. నాబార్డు ద్వారా పద్దెనిమిది వందల కోట్ల చిల్లర అని ఎద్దేవా చేశారు. హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు.
పోలవరం ఏపీకి జీవనాడి అన్నారు. దీనిపై ప్రజలంతా కలలు కంటున్నారన్నారు. పోలవరం పూర్తయితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమను కరువురహిత ప్రాంతంగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలలు కన్నాయన్నారు. కానీ చంద్రబాబు సాధించింది పద్దెనిమిది వందల చిల్లర కోట్లు నాబార్డు ద్వారా అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి పేరు లేకుండా చేస్తారా?
పోలవరం ప్రాజెక్టు విషయంలో యూపీఏ చైర్ పర్సన్ పేరు లేకుండా చేయాలని చూస్తారా అన్నారు. చంద్రబాబు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. గతంలో ఎప్పుడు ఆయన పోలవరం గురించి మాట్లాడలేదన్నారు. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి నా ఘనత అంటారా అన్నారు. పోలవరంపై కాంగ్రెస్ కమిట్మెంట్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
మీ పాత్ర లేదు..
పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకు లేదా టిడిపికి పాత్ర లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2018 నాటికి పోలవరం పూర్తి కాదని తనకు తెలిసిన ఇంజినీర్ల చెప్పారని, తాను కూడా చెప్పదలుచుకున్నానని అన్నారు.
నదుల అనుసంధానంపై.. మోటార్లు పెట్టారు అంతే
ప్రపంచంలోనే తాను తొలిసారి నదుల అనుసంధానం చేశానని చెబుతూ నాలుగుసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారా, ఇదేనే మీ పని అన్నారు. ఈ సంబరాల్లో కాంగ్రెస్ పార్టీకి పాత్ర లేదా అని నిలదీశారు. మీరు చేసింది.. కేవలం మోటార్లు పెట్టి, నీళ్లు తోడటం అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తవ్విన వాటికి మోటార్లు పెట్టారన్నారు.
మేం అడ్డుకుంటున్నామా? కమీషన్ కోసమే..
పోలవరం ప్రాజెక్టుకు తాము అభివృద్ధి నిరోధకులమా అని నిలదీశారు. తాము అడ్డుకుంటున్నామా అన్నారు. కేవలం కమిషన్ కోసం పోలవరం ప్రాజెక్టును మీరు తీసుకొని, కేంద్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు.