నారా టీడీపీతో లాంగ్ జర్నీ చెయ్యలేం: అందుకే లైన్లో నందమూరి కుటుంబం..!!
అమరావతి: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్తో సమావేశం కావడంపై చెలరేగిన ప్రకంపనల తీవ్రత ఇంకా తగ్గట్లేదు. దీనిపై వివిధ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలు, అంచనాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సహా టీడీపీ, బీజేపీ, సీపీఎం నేతలు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా స్పందించారు. ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణలు ఇచ్చారు.

అందుకే జూనియర్తో
తాజాగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ భేటీపై స్పందించారు. తెలుగుదేశం పార్టీలో సమర్థ నాయకత్వం కరువైందనే విషయం బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వానికి స్పష్టంగా తెలిసిందని అన్నారు. చంద్రబాబు తరువాత ఆ పార్టీకి సారథ్య బాధ్యతలను తీసుకునే సత్తా టీడీపీలో మరొకరికి లేదని చాటి చెప్పినట్టయిందని చెప్పారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్తో సంప్రదింపులు మొదలు పెట్టిందని పేర్కొన్నారు.

స్వయంగా అమిత్ షా..
దీనికోసం స్వయంగా అమిత్ షా రంగంలోకి దిగారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించగల నాయకత్వ లక్షణాలు ఆయనకు జూనియర్ ఎన్టీఆర్లో కనిపించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. తమ నాయకత్వం సరైనదేనా? కాదా? అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చూసుకోవాలని గుర్తు చేశారు. కారణాలు ఏమైనప్పటికీ- తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న నాయకత్వం సరైనది కాదనే భావన ప్రజల్లో వచ్చింది కదా? అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

టీడీపీతో సుదీర్ఘ ప్రయాణం..
టీడీపీకి ఇప్పుడున్న నాయకత్వంతో కలిసి తాము సుదీర్ఘకాలం పాటు ముందుకెళ్లలేమని బీజేపీ భావిస్తోందని, ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉందని అన్నారు. చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులే కారణం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్లా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వైసీపీ విముక్త ఏపీ కోసం పని చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు.

ప్రజలు ఎవరిని ఆదరిస్తారో.. వారికే అధికారం..
ప్రజలు ఎవరిని ఆదరిస్తారో.. ఆ ప్రభుత్వానికి మాత్రమే మనుగడ ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రజల ఆదరణ, మద్దతు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఉందని, తమ పార్టీ విజయానికి ఢోకా ఉండదని అన్నారు. వైఎస్ జగన్ అండతో వైసీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ విముక్త రాష్ట్రం అనేది పవన్ కల్యాణ్ అనుకుంటే సాధ్యపడుతుందని తాను అనుకోవట్లేదని అన్నారు.

పవన్కు ఇష్టం లేకపోయినంత మాత్రాన..
పవన్ కళ్యాణ్కు ఇష్టం లేనంత మాత్రాన వైసీపీ అధికారంలోకి రాకుండా పోతుందా అని అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉండటం పవన్ కల్యాణ్కు ఇష్టం ఉండొచ్చు.. లేకపోవచ్చు గానీ ప్రజలు ఏ పార్టీని అభిమానిస్తారో దాన్నే తమ ఓటు హక్కు ద్వారా తీర్పు ఇస్తారని అన్నారు. ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications