తిరుమల లడ్డూ కల్తీ వెనుక- సిట్ నివేదిక సిద్దం..!?
తిరుమల లడ్డూ కల్తీ ఘటన విచారణ కీలక దశకు చేరుకుంది. సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. తిరుపతిలోనే మకాం వేసి సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. లడ్డూ తయారీ కేంద్రం మొదలు..నెయ్యి సరఫరా కంపెనీల వరకు వివరాలు సేకరించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రాధమిక నివేదిక సిద్దం సిట్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
సంచలనం రేకెత్తించిన తిరుమల లడ్డూ కల్తీ ఘటన విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇప్పటికే సీబీఐ జేడీ నేతృత్వంలోని ఏర్పాటైన సిట్ వేగవంతం చేసింది. తిరుమలలో లడ్డూ తయారీ పోటును పరిశీలించింది. కావాల్సిన సమాచారం సేకరించింది. తిరుమలకు నెయ్యి టెండర్లు - కాంట్రాక్టర్ల ఖరారు పైన ఆరా తీసింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన కంపెనీలను పరిశీలించింది. ఏఆర్ డెయిరీలో విచారణ చేసింది. కొన్ని ఫైల్స్ ను స్వాధీనం చేసుకుంది. అక్కడి సిబ్బందిని విచారణ చేసింది.

నెయ్యి సరఫరా చేసిన సమయంలో లారీల డ్రైవర్ల విచారణకు సిద్దమైంది.ఇప్పటి వరకు విచారణ లో వెలుగులోకి వచ్చిన అంశాలను టీం సభ్యులు సీబీఐ ఉన్నతాధికారుల కు నివేదించారు. తిరుపతి కేంద్రంగా సిట్ తమ కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. అక్కడే టీటీడీ అన్ని వసతులు కల్పించింది. నెయ్యి సరఫరాలో లోపాల పైన ప్రాధమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా నెయ్యి సరఫరా చేసే కంపెనీలే సరఫరా చేసాయా.. మధ్యలో ఇతర కంపెనీల జోక్యం ఉందనే ఆరోపణల పైన చెక్ పోస్టుల నుంచి సమాచారం సేకరించారు.
అదే విధంగా తిరుమలకు చేరిన నెయ్యి శాంపిల్స్ లాబ్ లో ఏ విధంగా పరిశీలన చేస్తున్నారు... నాణ్యత ఏమేర నిర్ధారణ అవుతుందనే అంశాలను పరిశీలించారు. ఇక, తిరుపతిలో మకాం వేసిన సిట్ టీం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ డైరెక్టర్కు వివరాలు తెలిపారు. అంతకుముందు టీటీడీ ఈవో శ్యామలరావును సిట్ సభ్యులు కలిసారు. దర్యాప్తుకు కావాల్సిన సమాచారం కోరింది. నెయ్యి కొనుగోలుకు సంబంధించి విచారణలో తేలిన అంశాలతో ప్రాధమిక నివేదిక సిద్దం చేసిన సిట్.. ఉన్నతాధికారులను నివేదించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications