నెల్లూరు:వడ దెబ్బతో ఎమ్మార్వో చెంచు కృష్ణమ్మ మృతి...
నెల్లూరు:వడ దెబ్బ కారణంగా మహిళా ఎమ్మార్వో మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా రెవిన్యూ శాఖలో విషాదం నింపింది. జిల్లాలోని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని అనంతసాగరం మండల తహశీల్దార్ అయిన చెంచు కృష్ణమ్మ నాలుగు రోజుల క్రితం గ్రామ సభలో వడ దెబ్బకు గురయ్యారు.
ప్రాధమిక చికిత్స అనంతరం ఆమెని నెల్లూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. నాలుగు రోజు మృత్యువుతో పోరాడి బుధవారం ఆమె కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే...ఆనంతసాగరం తహశీల్దారు చెంచు కృష్ణమ్మ నాలుగు రోజుల క్రితం ఆనంతసాగరం మండలంలోని గౌరవరంలో "మీ భూమికి భరోసా" కార్యక్రమంలో పాల్గొనే సమయంతో ఎండ తీవ్రత కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు.

ఆ క్రమంలో స్పృహ కోల్పోయిన తహసీల్దార్ ను హుటాహుటిన నెల్లూరు లోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈమెను ఇక్కడ ఐసియులో ఉంచి నాలుగు రోజులుగా వైద్యసేవలు అందిస్తున్నారు. అయినా కోలుకోని మహిళా ఎమ్మార్వో బుదవారం ఆస్పత్రిలోనే మృతి చెందారు. ఆమె కోలుకునే విషయమై పలుసార్లు వాకబు చేసిన జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు ఆమె మరణం గురించి తెలిసిన హుటాహుటిన ఆస్పత్రి వద్దకు బయలుదేరి వచ్చారు. మహిళా తహసిల్దార్ చెంచు కృష్ణమ్మ మరణ వార్త విని భారీ సంఖ్యలో రెవిన్యూ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, ఆమె విధులు నిర్వహిస్తున్న మండల పరిధిలోని గ్రామాల ప్రజలు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వస్తున్నారు.












Click it and Unblock the Notifications