చంద్రబాబుకు లగడపాటి షాక్, కంగుతిన్న టిడిపి: జగన్ పార్టీ ఆనందం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీపై వివిధ రకాలుగా ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లోకి తిరిగి రావడం, ల్యాంకో పవర్ అంశంపై చర్చించేందుకు వచ్చారని వార్తలు వచ్చాయి.
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీపై వివిధ రకాలుగా ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లోకి తిరిగి రావడం, ల్యాంకో పవర్ అంశంపై చర్చించేందుకు వచ్చారని వార్తలు వచ్చాయి.
అదే సమయంలో నవ్యాంధ్రలో ప్రభుత్వం, ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబుకు నివేదిక ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇదీ మీ పని తీరు, వారిని తప్పించండి : బాబుకు లగడపాటి సీక్రెట్ రిపోర్ట్, హెచ్చరిక
ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగానే ఉన్నారని, ఎమ్మెల్యేల విషయంలో మార్పులు చేర్పుల ద్వారా మళ్లీ అధికారంలోకి రావొచ్చునని చంద్రబాబుకు వెల్లడించారు. తన సర్వే ద్వారా చంద్రబాబుకు లగడపాటి షాకింగ్ విషయాన్ని చెప్పారని అంటున్నారు.
వైసిపి గెలుపు ఖాయమని..
గతంలో లగడపాటి ఓ సర్వే చేశారు. అది వైసిపికి అనుకూలంగా వచ్చింది. నాటి సర్వేతో పాటు, తాజాగా తన అంచనాలను కూడా లగడపాటి... చంద్రబాబు ముందు ఉంచారని అంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే 2019లో వైసిపి గెలవడం ఖాయమని చెప్పారట.
70 శాతం ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదని..
70 శాతం ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదని చంద్రబాబుకు లగడపాటి షాకింగ్ రిపోర్ట్ ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యేల్లో 80 మంది వరకు 2019లో ఓడిపోతారని చెప్పడంతో చంద్రబాబు కంగుతిన్నారని అంటున్నారు.
టిడిపికి ఇబ్బందులు
ప్రస్తుతం అధికార పార్టీకి నూటా ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. లగడపాటి సర్వేలో వీరిలో ఎనభై మంది వరకు ఓడిపోవడం ఖాయమని తేలిందని అంటున్నారు.
చంద్రబాబుపై ప్రజలకు విశ్వాసం ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, అవినీతి నియంత్రణ లేకపోవడం, ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడం వంటి కారణాల వల్ల టిడిపి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని చెప్పారని తెలుస్తోంది.
టిడిపి అనుకూల మీడియానే చెప్పడం..
చంద్రబాబును కలిసిన లగడపాటి ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై నివేదిక ఇచ్చారని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే తొలుత ప్రచారం చేసిందని గుర్తు చేస్తున్నారు. అంటే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని విపక్షాలు చెబుతున్న దాంట్లో అబద్దం లేదని తేలుతోందని అంటున్నారు.
ఇతర మీడియాలు ప్రసారం చేస్తే..
లగడపాటి సర్వేను ఇతర మీడియా సంస్థలు ప్రచారం చేస్తే తెలుగుదేశం పార్టీ నేతలు అంతెత్తున లేచేవారని, అబద్దపు సర్వే అని, ఆ అబద్దపు సర్వేను వీరు ప్రసారం చేశారని చెప్పేవారని అంటున్నారు. కానీ ఇప్పుడు అనుకూల మీడియానే ప్రసారం చేయడాన్ని బట్టే ప్రభుత్వంపై వ్యతిరేకత అర్థమవుతోందంటున్నారు.
వైసిపిలో ఆనందం..
లగడపాటి ఇచ్చినట్లుగా చెబుతున్న సర్వే టిడిపి అనుకూల మీడియాలోనే రావడంతో దానిని వైసిపి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. చంద్రబాబుకు లగడపాటి చేసిన సూచనలను పక్కన పెడితే.. ఆయన రిపోర్ట్ టిడిపికి షాక్ అని, వైసిపికి ఊరట అని చెబుతున్నారు.