చేయి చేసుకుంటా: టీ జర్నలిస్టులపై లగడపాటి హెచ్చరిక
న్యూఢిల్లీ: కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణ జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు. వారిని తీవ్రంగా హెచ్చరించారు కూడా. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందానికి (జివోఎంకు) నివేదిక వంపడానికి ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులు కొంత మంది ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
జర్నలిస్టుల ప్రశ్నలతో లగడపాటి అసహనానికి గురయ్యారు. ప్రశ్నలు వేసిన పత్రికా రచయితలపై రుసరుసలాడారు. అవసరమైతే చేయి చేసుకుంటానని హెచ్చరించారు. మీ అంతు చూస్తానంటూ ఆగ్రహంతో రెచ్చిపోయారు. దీంతో అక్కడున్నవారు జోక్యం చేసుకుని లగడపాటిని పక్కుకు తీసుకుని వెళ్లారు .

లగడపాటి రాజగోపాల్ తీరును తెలంగాణ జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. లగడపాటి రాజగోపాల్ వైఖరి అభ్యంతరకరంగా ఉందని విమర్శించాయి. తన మీడియా సమావేశంలో కాంగ్రెసు అధిష్టానంపై దాదాపుగా ఆయన తిరుగుబాటు బావుటా ఎగురేశారు. ఎన్నికల కోసమే విభజన చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని, అలాంటప్పుడు ఎన్నికలకు వెళ్తే ప్రజా తీర్పు ఎలా ఉంటుందో అందరికీ తెలుసునన్నారు. సమస్యలను పరిష్కరించకుండా విభజన ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదన్నారు.
ఎన్నికల ముందు విభజన అనుమానాలు రేకెత్తిస్తుందన్నారు. తాను సమైక్యవాదినని, వ్యక్తిగత హోదాలో సమైక్యం కోసం నివేదిక ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయవద్దని కాంగ్రెసు పార్టీకి హితవు పలికారు.












Click it and Unblock the Notifications