అన్నింటికీ తెగించా, దేనికీ బెదరను: ఎంపి లగడపాటి
విజయవాడ: తాను సమైక్య రాష్ట్రం కోసం అన్నింటికీ తెగించానని, ఎవరికీ బెదరనని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. మెజార్టీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కేంద్రం చేపడుతున్న రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకుంటామని తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గతంలో రాష్ట్రాల విభజన సమయంలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీ కోరితే.. అదనపు సమయం ఇచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వారాలపాటు సమయం కోరితే.. కేంద్రం కేవలం ఒక వారం మాత్రమే ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
శాసనసభలో మెజార్టీ సభ్యుల అభిప్రాయమే సభ అభిప్రాయం అవుతుందని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన కోసం రాజ్యాంగ రక్షకులపై కూడా తన ప్రభావాన్ని చూపుతోందని ఆరోపించారు. చేతులు ముడుచుకుని ఉంటే కేంద్రం ముందు అలుసైపోతామని అన్నారు. విభజించాలని కోరారు కాబట్టి, వీరి అభిప్రాయం ఎందుకులే అన్నట్లు కేంద్రం వ్యహరిస్తోందని చెప్పారు. విభజించాలని రాజకీయ పార్టీల అధ్యక్షులు మాత్రమే చెప్పారని, ప్రజలు గానీ, ప్రజాప్రతినిధులు గానీ చెప్పలేదని లగడపాటి అన్నారు.

అసెంబ్లీలో తీర్మానం పెట్టి తెలంగాణ బిల్లుపై చర్చకు మరింత గడువు కోరితే కేంద్రం అంగీకరించే అవకాశం ఉందని చెప్పారు. పార్లమెంటులో తొందరగా బిల్లు ప్రవేశపెట్టాలని, ఇచ్చిన గడువునే సరిపెట్టుకోమంటే చేతులు ముడుచుకుని ఉండమని తేల్చి చెప్పారు. అసెంబ్లీ హక్కులు కాలరాయడానికి కేంద్రానికి హక్కు ఎవరిచ్చారని లగడపాటి ప్రశ్నించారు. ఎన్నికల్లో లభ్ది పొందేందుకే కేంద్రం రాష్ట్ర విభజన చేస్తోందని ఆరోపించారు. ఒకవారం గడువు ఇచ్చిన కేంద్రం, మరో మూడు వారాలపాటు గడువు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తాను సమైక్యం కోసం దేనికైనా సిద్ధమని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా ఇంటి ముందైనా, ప్రధాని మన్మోహన్, హోంమంత్రి షిండేల ఇంటి ముందైనా బైఠాయించేందుకు వెనకాడబోమని లగడపాటి హెచ్చరించారు. రాష్ట్ర సమైక్యత కోసం పార్లమెంటునైనా ఎదుర్కొంటామని తెలిపారు. అసెంబ్లీ సభ్యులు కోరుకున్న సమయం ఇవ్వాలని, సభ్యులందరూ మాట్లాడేందుకు మరింత సమయం కోసం పోరాటం చేస్తామని తెలిపారు.
తమని చేతకాని వాళ్లుగా భావించి కేంద్రం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ పరంగానే ముందుకు వెళతామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోపాటు మంత్రులతోపాటు మాట్లాడానని, అందరం ఏకమై అసెంబ్లీ హక్కును కాపాడుతామని చెప్పారు. గడువు కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కోరితే కేంద్రం సమయం ఇస్తుందని, లేదంటే తాము పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కేంద్ర వ్యూహాలకు ఎదురు వ్యూహాలు వేసి ముందుకు వెళతామని తెలిపారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ తర్వాత ఓటింగ్ జరపాలని ఆయన కోరారు.
పార్లమెంటులో బిల్లు పెట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూసేవారికి తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు. అసెంబ్లీలో గడువు కోసం తీర్మానం పెట్టి కేంద్రాన్ని కోరితే.. ఇతర రాష్ట్రాల నుంచి, జాతీయ మీడియా నుంచి కూడా మద్దతు లభించే అవకాశం ఉందని తెలిపారు. కేంద్రం చేతిలో తాము కీలు బొమ్మలం, తోలు బొమ్మలం కాదని తేల్చి చెప్పారు.
గతంలో విభజనకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టామని గుర్తు చేశారు. తమను అడ్డుకోలేని కేంద్రం సమావేశాలను ముగించుకుందని చెప్పారు. సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఢిల్లీకి వెళ్లాలని కోరారు. ప్రలు సమైక్యాన్ని కోరుకుంటున్నారని, పదవిలో కొనసాగినా, రాజీనామా చేసైనా సమైక్య రాష్ట్రాన్ని సాధించాలని వారు కోరుతున్నారని చెప్పారు.
ఫిబ్రవరి 21న పార్లమెంటు సమావేశాల చివరి సెషన్ ఉంటుందని, అప్పుడే తాము సమైక్యత కాపాడామా లేదా అనేది తెలుస్తుందని లగడపాటి చెప్పారు. కేంద్రం మెజార్టీ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లలేదని తెలిపారు. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎలా ప్రవేశపెడుతుందో చూస్తామని హెచ్చరించారు. తమ వద్ద ఇంకా బలమైన అస్త్రాలున్నాయని తెలిపారు. పార్లమెంటును ఒక్కరోజు కూడా జరగనివ్వమని అన్నారు. సమైక్యాంధ్ర పార్టీ అనేది లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications