ఇంకా రెండ్రోజులున్నాయి, చూద్దాం: టిబిల్లుపై లగడపాటి
న్యూఢిల్లీ/ హైదరాబాద్: ఇంకా రెండు రోజులున్నాయని, ఏమవుతుందో చూద్దామని మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విభజన బిల్లుపై వ్యాఖ్యానించారు. ఇంత వరకు రాష్ట్ర సమైక్యత కోసం పోరాడామని, ఇక నుంచి తెలుగు ప్రజల మధ్య ఐక్యత కోసం పోరాటం చేస్తామని ఆయన బుధవారం మీడియాతో అన్నారు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా కిరణ్ కుమార్ రెడ్డిని తామే ఆపుతూ వచ్చామని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి తమ వెంట ఉన్నారనే భరోసాతో పార్లమెంటు సభ్యులం పోరాటం చేశామని ఆయన అన్నారు.
సంబరాల సమయం కాదు: జెపి
పునర్నిర్మాణంలో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. తెలుగు ప్రజలకు ఇది పరీక్షా సమయమని, సంబరాలకు సమయం కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు కాబట్టి రాష్ట్రపతి పాలన విధించడమే మంచిదని ఆయన అన్నారు. పదేళ్ల పాటు సీమాంధ్ర రెవెన్యూ లోటును కేంద్రమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రం కుటిల నీతి: విద్యాసాగర రావు
తెలంగాణ బిల్లుపై కేంద్రం కుటిల నీతి మరోసారి బయపడిందని బిజెపి నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు అన్నారు. రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాతనే తమ సవరణలు ఏమిటో తెలుస్తాయని ఆయన బుధవారంనాడు అన్నారు. రాష్ట్ర ప్రజలను కేంద్రం మోసం చేస్తోందని ఆయన విమర్శించారు.
బిల్లును ప్రవేశపెట్టక ముందే తమ పార్టీని తప్పు పట్టడం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్కు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. రాజ్యసభలో బిల్లును ఈ రోజు ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు.