లక్ష ఎకరాలు అక్రమంగా: మంత్రులు, ఇన్కంపై బాబు
హైదరాబాద్: గతంలో లక్ష ఎకరాల మేర భూములను అక్రమంగా కట్టబెట్టారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు సోమవారం నాడు ఆరోపించారు. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పైన చర్యల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ఈ నెల 28వ తేదీన మరోసారి సమావేశమవుతామన్నారు. జీవోలో మార్పులు చేర్పుల పైన త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ల్యాండ్ ఆడిట్ కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. 571, 607 జీవోల రద్దు లేదా సవరణపై ఆలోచిస్తున్నామన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో సోమవారం సమావేశమయ్యారు. నిడదవోలు ప్రభుత్వ కళాశాలలో పార్టీకి చెందిన జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఉభయ గోదావరి జిల్లాల నుంచి లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని, ఆదాయం పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు. కొవ్వూరు దగ్గర వైట్ ఫీల్డ్ భూముల్లో భారీ పరిశ్రమలకు అవకాశం ఉందన్నారు. ప్రైవేటు రంగంలో ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఉపాధి హామీలో రైతులు భాగస్వామ్యం కావాలన్నారు. ఆక్వా పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.