తిరుచానూరులో అమ్మవారి లక్ష కుంకుమార్చన, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, తిరుపతిలో!
తిరుపతి/తిరుచానూరు: తిరుపతి సమీపంలోని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది.
హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది.
లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది.

అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు.
ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుమల బ్రహ్మోత్సవాల లాగే రంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 10వ తేదీన శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.10 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.












Click it and Unblock the Notifications