లోక్ సత్తా జేపీ పైనే లక్ష్మీపార్వతి ఆశలు : గట్టెక్కిస్తారా - అన్ స్టాపబుల్..!!
బాల - చంద్ర సంచలనంగా మారిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రాజకీయ సంచలనంగా మారుతోంది. 1995 లో టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలు - వైశ్రాయ్ ఘటన గురించి చంద్రబాబు పూర్తిగా వివరించారు. నాడు చంద్రబాబు - ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారంటూ 27 ఏళ్లుగా ప్రచారంలో ఉంది. దీనికి తాను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని.. ఏం జరిగిందో బాలయ్య ఇంటర్యూలో పూర్తిగా వివరించానని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పారు. తాను ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొనే ప్రయత్నం చేసినా..తన మాట వినలేదని చెప్పుకొచ్చారు. ఈ అంశం పైన నాటి వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన లక్ష్మీ పార్వతి స్పందించారు.
అసలు చంద్రబాబు ఎప్పుడు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొన్నారని లక్ష్మీ పార్వతి ప్రశ్నిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో కీలక అంశాలను ప్రస్తావించారు. 1995లో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి చంద్రబాబుకు మద్దతుగా 50 మంది ఉన్నారని లక్ష్మీ పార్వతి చెబుతున్నారు. వారంతా చంద్రబాబు ఏం చేయమంటే అది చేయటానికి సిద్దంగా ఉండే వారని వివరించారు. 1995 లో ప్రజల వద్దకు పాలన పేరుతో ఎన్టీఆర్ -తాను ఉత్తరాంధ్రలో పర్యటన చేసిన సమయంలో..విశాఖలో డాల్ఫిన్ హోటల్ కేంద్రంగా కుట్ర మొదలైందని..వైశ్రాయ్ లో పూర్తి చేసారని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో డాల్ఫిన్ లో ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు చేస్తున్న మంత్రాంగం పైన ప్రతిభా భారతి నేరుగా ఎన్టీఆర్ కు వివరించారని లక్ష్మీ పార్వతి వెల్లడించారు. చంద్రబాబు -బాలయ్య ఇద్దరూ ఆ రోజున తన కారణంగానే ఆ పరిణామాలు జరిగాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాడు జరిగిన పరిణామాలకు సాక్ష్యంగా ఎన్టీఆర్ వద్ద పని చేసిన ఐఏఎస్ అధికారి.. ప్రస్తుత లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ కు చాలా వరకు విషయాలు తెలుసన్నారు. ఆయన బయటకు చెబితే వాస్తవాలు అందరికీ తెలుస్తాయని చెప్పుకొచ్చారు. అదే విధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వారికి అన్నీ తెలిసినా.. ఇప్పడుు చంద్రబాబుతో ఉండటంతో నోరు విప్పే అవకాశం లేదన్నారు.
చంద్రబాబు - బాలయ్య ఇప్పుడు ఒక షో వేదికగా నాడు జరిగినవి చెబుతున్నారని..అదే సమయంలో నాడు ఎన్టీఆర్ అందరి సమక్షంలో చంద్రబాబు గురించి చెప్పిన అంశాలు నిజమా కాదా చెప్పాలని లక్ష్మీ పార్వతి బాలయ్యను డిమాండ్ చేసారు. నాడు ఎన్టీఆర్ చెప్పినవి అబద్దాలని బాలయ్య చెబితే మరోసారి తాను ఎప్పుడూ ఈ వ్యవహారంలో బాలయ్య పేరు తీసుకురానని స్పష్టం చేసారు.
అయితే, లక్ష్మీ పార్వతి ఈ వివాదం గురించి లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణకు చాలా వరకు తెలుసని చెప్పినా..ఆయన బటయకు వచ్చి వాటి గురించి ఇప్పుడు స్పందిస్తారా లేదా అనేది సందేహమే. ఇటు చంద్రబాబు..అన్ స్టాపబుల్ వేదిక ద్వారా జరిగిన అన్ని విషయాలు వివరించానని మరింత ఆసక్తిని పెంచారు. ఇదే సమయంలో వైఎస్సార్ తో అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పారు... దీనికి స్పందన ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తిని పెంచుతోంది.