నందమూరికి ప్రమోషన్ ఇచ్చిన జగన్
Lakshmi Parvathi: వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియామకాల పరంపర కొనసాగుతోంది. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండటం వల్ల దీనికి అనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటోన్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ కమిటీల వరకూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. వన్ నేషన్- వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ను తెర మీదికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రివర్గం సైతం దీనికి ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా సోమవారం నాడు ఈ బిల్లు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో ఇప్పటినుంచే పార్టీని బలోపేతం చేయడంపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే రీజినల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేశారు. పార్టీ సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించారు. భారీగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు ఈ హోదాలో పని చేసిన వాళ్లలో కొందరిని కొనసాగించినప్పటికీ- వాళ్లు పర్యవేక్షించిన ప్రాంతాలు మారాయి.
ఈ మార్పులు చేర్పులను మరింత వేగవంతం చేశారు జగన్. సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటనలకు పూనుకున్నందున ఈలోగా బూత్ స్థాయి వరకు కమిటీల నియామకంపై కసరత్తు సాగుతోంది. ఇప్పటికే పలువురు నాయకులకు రాష్ట్రస్థాయి పదవులు ఖరారు చేశారు. జిల్లాలకు అధ్యక్షులనూ నియమించారు. ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధుల నియామకాలు కొనసాగుతున్నాయి.

ఇటీవలే మాజీ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్ను రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా నియమించారు జగన్. దీనికి కొనసాగింపుగా తాజాగా పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతికి ప్రమోషన్ ఇచ్చారు జగన్. ఆమెను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
అలాగే- గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గడ్డేటి సురేంద్రను నియమించారు. పల్నాడు జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పఠాన్ సలేహా ఖాన్, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా మైలవరం నియోజకవర్గానికి చెందిన పామర్తి శ్రీనివాసరావు ఇటీవలే నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications