దెబ్బకు దెబ్బ తీసిన భారత్..! పాక్ కవ్వింపు చర్యకు ఢిల్లీలో దీటైన జవాబు..!
భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య ఉన్న వైరం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఇప్పటికే పహల్గాం దాడుల తర్వాత పాకిస్తాన్ కు వెళ్లే సింధు నదీ జలాల్ని నిలిపేసిన భారత్.. శత్రుదేశంపై ఒత్తిడి పెంచింది. తీవ్రవాదాన్ని వదులుకుంటేనే తదుపరి చర్యలు ఉంటాయని ఎప్పటికప్పుడు తేల్చిచెబుతూనే ఉంది. అలా కాదని యుద్దానికి దీటైన జవాబు ఇచ్చేందుకు కూడా సిద్దమని భారత సైన్యం హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లోనూ పాకిస్తాన్ ఓ కవ్వింపు చర్యకు దిగింది. అయితే అది సరిహద్దుల్లో కాదు, దౌత్యపరంగా. దీంతో భారత్ కూడా దీటుగా బదులిచ్చింది.
పాకిస్తాన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద భద్రతా బ్యారికేడ్లను ఆ దేశ అధికారులు తాజాగా తొలగించారు. ఎలాంటి కవ్వింపు చర్య లేకుండానే పాకిస్తాన్ ఇలా దౌత్యపరంగా భద్రంగా ఉంచాల్సిన హైకమిషన్ బ్యారికేడ్లను ఏకపక్షంగా తొలగించేసింది. దీంతో భారత్ కూడా అలాంటి చర్యతోనే గట్టిగా బదులిచ్చింది. భారత అధికారులు కూడా న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చుట్టూ ఉన్న ట్రాఫిక్ బోలార్డులు, బారికేడ్లను తొలగించారు. పాకిస్తాన్ హైకమిషన్ నిర్దేశిత పరిధికి బయట ఉన్న ఈ నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ బయట దెబ్బతిన్న బారికేడ్లు దర్శనమిస్తున్నాయి. పాకిస్తాన్ మిషన్లోని వీసా విభాగం సమీపంలో ఉన్న క్యూ లైనర్లను కూడా తొలగించారు.

#WATCH | Delhi | Authorities have dismantled the external security perimeter outside the Pakistan High Commission, removing traffic bollards and barricades that previously ring-fenced the diplomatic compound pic.twitter.com/WM2KEZwizN
— ANI (@ANI) August 20, 2026
అయితే పాకిస్తాన్ హైకమిషన్ వద్ద బ్యారికేడ్ల ధ్వంసంపై భారత్ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా కాశ్మీర్పై అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆగ్రహంగా ఉంది. శ్రీనగర్ పర్యటన సందర్భంగా సెర్గియో గోర్ కాశ్మీర్ భారత్ లో ముఖ్యమైన ప్రాంతమంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అసంతృప్తిగా ఉన్న పాకిస్తాన్.. ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద బ్యారికేడ్లు తొలగించి కవ్వింపు చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా అందుకు దీటుగా బదులిస్తూ పాక్ హైకమిషన్ వద్ద బ్యారికేడ్లను ధ్వంసం చేసేసింది. మరోవైపు సెర్గియో గోర్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు పాకిస్థాన్ .. ఇస్లామాబాద్లోని అమెరికా తాత్కాలిక రాయబారి నటాలీ బేకర్ను పిలిపించింది. గోర్ పర్యటన, జమ్మూ కాశ్మీర్ హోదాపై ఆయన చేసిన వ్యాఖ్యలపై తాము తీవ్రమైన అభ్యంతరాన్ని తెలిపినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.














Click it and Unblock the Notifications