పవన్ కష్టమే, బాలకృష్ణకు శక్తి లేదు: లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: పలువురు ప్రముఖులపై ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చేతిలో మోసపోయిన వ్యక్తి అని ఆమె అన్నారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న చిరంజీవియే రాజగకీయాల్లో నిలదొక్కుకోలేకపోయారని, పవన్ పార్టీ పెట్టినా నిలవడం సాధ్యం కాదని ఆమె అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలపై మాట్లాడారు. బాలకృష్ణ అమాయకుడని, ఆయనకు పార్టీని నడిపేంత శక్తి లేదని ఆమె అభిప్రాయపడ్డారు. చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఒకప్పుడు దేవతలు క్షీరసాగ మథనం చేస్తే తొలుత విషం వచ్చిందని, ఆ తర్వాత అప్సరలుల వచ్చారని, కానీ దేవతలు విషాన్ని చూసి బెదరలేదని, అప్సరసల వ్యామోహానికి లోను కాలేదని, అమృతం సాధించేవరకు లక్ష్యం కోసం పనిచేశారని అంటూ ఆమె జగన్ను కొనియాడారు.
అలాంటి ధీరచరిత జగన్మోహన్ రెడ్డిలో కనిపించిందని ఆమె చెప్పారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని, లక్ష్యాన్ని చేరే వరకు వారు పోరు విరమించబోరని ఆమె అన్నారు. వేల కోట్లు దోచుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు జగన్పై అవినీతి ఆరోపణలు చేసే ముందు వారివారి మనస్సులను ప్రశ్నించుకోవాలని ఆమె అన్నారు.
చంద్రబాబు ఆస్తులన్నీ సింగపూర్లో ఉన్న విషయం అందరికీ తెలుసునని ఆమె అన్నారు. విజయమ్మ కేసులు వేస్తే స్టేలు తెచ్చుకుని మేనేజ్ చేసుకున్న చరిత్ర చంద్రబాబుదని ఆమె అన్నారు. తన కుమారుడి కోసం చంద్రబాబు మరింత రెచ్చిపోయి అవినీతికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. తనను అందరూ అవమానించి రోడ్డు మీద నిలబెట్టిన సమంయలో జగన్ ఓ కొడుకులా తనను చేరదీశాడని ఆమె చెప్పారు. అండగా నిలిచి, పోరాడేందుకు వేదికనిచ్చిన జగన్ పార్టీలో తాను ఉన్నందుకు భర్తగా ఎన్టీఆర్ ఆత్మ నిజంగానే సంతోషిస్తుందని ఆమె అన్నారు.
చిన్నపిల్లాడిపై తండ్రి చనిపోయిన వెంటనే సోనియా గాంధీతో కలిసి కేసులు వేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆమె వ్యాఖ్యానించారు. కనీసం జగన్కు నిలదొక్కుకునే అవకాశం కూడా ఇవ్వకుండా జైలుకు పంపించారని ఆమె వ్యాఖ్యానించారు.