దారుణంగా కొట్టారు.. విశాఖలో ఎందుకీ దుష్ట సంస్కృతి: అందాల పోటీలపై లక్ష్మీ పార్వతి
'అందాల పోటికి వ్యతిరేకంగా ఆందోళన చేపడితే మహిళలను దారుణంగా కొట్టారని' ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: 'మిస్ వైజాగ్' పేరిట విశాఖపట్నం వేదికగా తలపెట్టిన అందాల పోటీలకు మహిళ సంఘాల సెగ తగులుతోంది. ఇప్పటికే పలు మహిళ సంఘాలు దీనిపై నిరసనకు దిగగా.. తాజాగా మంగళవారం వైసీపీ మహిళా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
ధర్నాలో పార్టీ నేత లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. 'అందాల పోటికి వ్యతిరేకంగా ఆందోళన చేపడితే మహిళలను దారుణంగా కొట్టారని' ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇంతకుముందు కూడా బీచ్ ఫెస్టివల్ చేసేందుకు విఫలయత్నం చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఎందుకీ దుష్ట సంస్కృతిని ప్రవేశపడుతోందని మండిపడ్డారు.
ధర్నాను అడ్డుకున్న పోలీసులపై ఆమె మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీస్ వ్యవస్థ చెంచాలా పనిచేస్తోందని, మహిళలపై దాడులను అరికట్టడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో భూకబ్జాలు, రౌడీయిజం రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు.
విశాఖలో భూకబ్జాలపై ఏదో తూతూమంత్రంగా కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని ఆమె ఆరోపించారు. ఇక సీఎం చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి టీడీపీని హస్తగతం చేసుకున్నఆయన పార్టీని భ్రష్టు పట్టించారని విమర్శించారు. కబ్జా రాజకీయాలు, రోడ్డుపై మానభంగాలు ఇదా టీడీపీ రాజకీయమంటూ ప్రశ్నించారు. టీడీపీని కార్పోరేట్ వ్యక్తులకు అమ్మేశారని ఆరోపించారు.