అమరావతి 'అధికార' భూదందా: బాబు ప్లాన్, వారు కొన్నారు?
హైదరాబాద్: భూదందాల ద్వారా అధికార పార్టీకి చెందినవారు ప్రణాళికాబద్దంగా సొమ్ము చేసుకోవడం కొత్తదేమీ కాదు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పని జరిగింది. ఇప్పుడు ఆ పని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తున్నారు. భూములను కొనుగోలు చేసిన తర్వాత ప్రణాళికాబద్దంగా ప్రభుత్వం ఆ భూములకు విలువ పెంచే కార్యక్రమం చేపడుతుంది.
అది బహుశా చాలా వరకు చట్టబద్దంగా కూడా జరగవచ్చు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఫ్యాబ్ సిటీ, సైన్స్ సిటీ వంటి ప్రాజెక్టులను ప్రకటించారు. ఈ ప్రకటనలు వెలువడడానికి ముందే అధికార పార్టీకి చెందినవారు, అధినేత అనుయాయలు భూములు కొనుగోలు చేస్తారు. ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు వెలువడగానే ఆ భూములకు విలువ పెరుగుతుంది. దాంతో వాటిని అమ్మేసుకుని అధికార పార్టీకి చెందినవారు సొమ్ము చేసుకునే వ్యవహారం నడుపుతారు.
హైదరాబాద్ రింగ్ రోడ్డు డిజైన్ మార్పులో కూడా ఆ వ్యవహారమే నడిచిందనే ఆరోపణలు వైయస్ హయాంలో వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు హయాంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిచినట్లు కనిపిస్తోంది. అమరావతికి సంబంధించిన ప్లాన్ ముందుగానే, బహుశా ఎన్నికలకు ముందే తయారై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దాంతో అధికార పార్టీకి చెందినవారు ముందుగానే అక్కడి భూములను కొనుగోలు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. అందుకే, ముందుగానే తాము భూములు కొన్నామనే ప్రకటనలు పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటివారి నుంచి వెలువడుతున్నాయి. పైకి ఇదంతా చట్టబద్గంగానే కనిపిస్తుంది. చట్టవ్యతిరేకమని కూడా చెప్పలేం. అధికార పార్టీకి చెందినవారు చాలా మంది అమరావతి ప్లాన్ ముందే తెలియడంతో ఆ చుట్టుపక్కల భూములను కొనుగోలు చేసినట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.
చట్టబద్దం కావచ్చు గానీ నైతికంగా మాత్రం సరైందని చెప్పలేం. అధికారంలో ఉన్నారు కాబట్టి వారికి ఇష్టమైన రీతిలో ప్రాజెక్టులు చేపట్టి, వాటిని బహిర్గతం చేయక ముందు ఆ చుట్టుపక్కల భూములను అవసరమైతే ప్రజలకు ఎక్కువ ఆశ చూపి కొనుగోలు చేయడం పద్ధతిగా నడిచిందని అనిపిస్తోంది.
అమరావతి నిర్మాణ ప్రకటన వెలువడిన తర్వాత భూములు అమ్ముకున్న రైతులు బిక్కమొహం వేసే పరిస్థితిని, గుడ్లు తేలేసే పరిస్థితిని అధికార పార్టీ కల్పించినట్లు తెలుస్తోంది. విజయవాడలో చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న క్యాంప్ అఫీస్ విషయంలో కూడా ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు కారణంగా అక్రమ నిర్మాణాలు చట్టబద్దమైనట్లుగా భావించాలా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
చంద్రబాబు భూములు కొనుగోలు చేస్తే తప్పేమిటని గురువారం రాత్రి మీడియా సమావేశంలో ప్రశ్నించారు. చట్టబద్దంగా తప్పు లేకపోవచ్చు గానీ నైతికంగా మాత్రం ప్రజలను మోసం చేసినట్లేనని భావించాల్సి ఉంటుంది. అమరావతి నిర్మాణం ద్వారా ఆ చుట్టుపక్కల ప్రజల భూములు ముందుగానే పెద్దల సొంతం కావడం ఓ పద్ధతి ప్రకారం జరిగిందనేది మాత్రం అర్థమవుతోంది.
బహుశా ఇది వైయస్ రాజశేఖర రెడ్డి నుంచి ప్రారంభమైంది కూడా కాకపోవచ్చు. అంతకు ముందు హైదరాబాద్ చుట్టపక్కల ఈ పనే జరిగినట్లు తెలుస్తోంది. అయితే, వైఎస్ హయాంలో అది ఊపందుకుంది. సెజ్లకు భూసేకరణ వంటి కార్యక్రమాలు కూడా ఇటువంటివేనని చెప్పవచ్చు.