సింగపూర్ ప్రణాళిక, బాబు శంకుస్థాపన: రాజధాని భూములు ఆకాశానికి!
అమరావతి: అమరావతిలో భూముల ధరలు పెరుగుతున్నాయి. రాజధాని కేంద్ర ప్రాంతం (సీడ్ కేపిటల్)పై స్పష్టత ఇవ్వడం, అక్టోబరు 22న రాజధాని నిర్మాణం మొదలు పెడతామని ప్రభుత్వం చెప్పడంతో భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.
జరీబు ప్రాంతంలో కూడా భూముల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. రాజధాని కేంద్రప్రాంత పరిధిలో ఉన్న ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామాల పరిధిలోని భూములు కొనేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
ఈ గ్రామాల్లోని ఎకరం భూమి రూ.2 కోట్లకు పైనే చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పరిణామాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఒక దశలో బాగా వేగంగా పెరిగిన ధరలు, ఆ తర్వాత మళ్లీ కొంత తగ్గి కొంత కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి.
సింగపూర్ ప్రభుత్వం రాజధాని కేంద్రప్రాంత ప్రణాళిక ఇవ్వడం, అక్టోబరు 22న శంకుస్థాపన చేస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరగడం 2014 అక్టోబరు చివరి వారంలో మొదలైంది.
అప్పటి వరకు ఎకరం రూ.10-12 లక్షల లోపే ఉన్న మెట్ట భూముల ధరలు ఒక్కసారిగా రూ.70 లక్షలకు చేరాయి. ఆ తర్వాత ఒకటి రెండు నెలల్లో ఇక్కడ మెట్ట ప్రాంత భూముల ధరలు ఎకరం కోటిన్నరకు కూడా పలికాయి.
ఆ తర్వాత కొద్ది రోజులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు మళ్లీ భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రాజధాని శంకుస్థాపనకు సమయం దగ్గర పడుతుండటంతో ధరలు పెరుగుతున్నాయి.
ఆ తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వం తమ భూమిని అభివృద్ధి చేసి తమ వాటా ఇచ్చాక గజాల్లో విక్రయించుకుంటే ఇంకా ఎక్కువ ధర వస్తుందన్న ఉద్దేశంతో ఎక్కువ మంది రైతులు వేచి చూశారు. ఇప్పుడు మళ్లీ ధరలు ఆకర్షణీయంగా ఉండటంతో కొందరు భూములు విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు.