ఎపి రాజధానిలో భూ కుంభకోణం...సీఆర్డీఏ అధికారుల హస్తం?...సిఎం సీరియస్
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని పరిధిలో రోజుల వ్యవధిలో వెలుగు చూసిన భూ కుంభకోణాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల మందడంలో ల్యాండ్ పూలింగ్కు ఇవ్వని రైతు తాను భూమిని ఇచ్చినట్టు చూపి లక్షల్లో కౌలు స్వాహా చేసిన ఘటన మరువక ముందే...తాజాగా వెలుగు చూసిన మరో కోట్ల రూపాయల ల్యాండ్ స్కాం కలకలం రేపుతోంది.

ఎలా బైట పడిందంటే...స్థానిక రైతులే కనిపెట్టారు...
వాణిజ్య ప్లాటును గుట్టుచప్పుడు కాకుండా విజయవంతంగా అమ్మేసుకున్న పఠాన్ గౌస్ఖాన్...అలా కోటి 30 లక్షల వరకు వెనకేసుకున్నాడు...ఇక ఈసారి నివాస ప్లాటు విక్రయించేందుకు రంగంలోకి దిగాడు...అయితే భూమి అమ్ముతానంటూ తిరుగుతున్నపఠాన్ గౌస్ఖాన్ ఎవరో అక్కడ స్థానికులకు ఎవరికీ తెలీదు. అసలు అతడికి అక్కడ భూమి ఎలా వచ్చిందో వారికి అర్ధం కాలేదు...తమకు తెలియకుండా పఠాన్ గౌస్ఖాన్ అనే వ్యక్తికి స్థలం ఎలా వచ్చిందని...అంతకంటే ముందు అసలు అతనికి పొలం ఎక్కడుందని రైతులు ఆరా తీయడంతో అందరికీ దిమ్మతిరిగి పోయే ల్యాండ్ స్కాం బైటపడింది.
Recommended Video


ఈ దారుణమైన ల్యాండ్ స్కాం వెనుక...సిఆర్డిఏ అధికారుల హస్తం...
ఈ భూ కుంభకోణం జరగటానికి మందడం సీఆర్డీఏ-2 కార్యాలయంలో కొంతమంది అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్ సహకరించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పఠాన్ గౌస్ఖాన్ పొలం ఇచ్చినట్లు చెబుతున్న ఆ సర్వే నెంబర్ అండంగల్లో ఆ పేరుతో రైతులు ఎవరూ లేరు...కానీ...మూడేళ్లుగా కౌలు చెల్లించినట్లు రికార్డుల్లో చూపారు...మందడం రెవెన్యూలో సర్వే నెంబర్ 207 బై 1లో ఆర్ఎస్ ఆర్ ప్రకారం ఏడు ఎకరాలు భూమి ఉంది. అందులో రైతులకున్న భూమి పోను ఎకరం 70 సెంట్లు మిగులు భూమి రికార్డుల్లో కనబడుతుంది. దీన్ని పసిగట్టిన మందడం యూనిట్ అధికారులు పఠాన్ గౌస్ ఖాన్ అనే వ్యక్తికి సర్వే నెంబర్ 207ని కేటాయించి ల్యాండ్ పూలింగ్కి తీసుకున్నట్టు ఫైల్ తయారు చేసినట్టు తెలిసింది. ఈ స్కాం చేశాక ఇందుకు సంబంధించిన ఫైల్ను కూడా మాయం చేసేశారని తెలిసింది.

ముఖ్యమంత్రి సీరియస్...3 రోజుల్లో నివేదికకు ఆదేశం...
ఈ భూ కుంభకోణం రాజధాని రైతులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ ల్యాండ్ స్కాంపై సిఆర్డిఎ కమిషనర్ శ్రీధర్ స్వయంగా విచారిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ ల్యాండ్ స్కాం విషయమై మీడియాలో వార్తలు రావడంతో సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ భూ కుంభకోణాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ స్కాం గురించి 3 రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని సిఆర్డిఏ కమీషనర్ ను ఆదేశించారు. తప్పు చేసిన వారెవరైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అధికారులను వదిలి...కిందిస్థాయి
ఉద్యోగులేనా...బలిపశువులు...
సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ కార్యాలయాల్లో సాధారణంగా డిప్యూటీ కలెక్టర్లకు తెలియకుండా ఏమీ జరగదు. భూ కేటాయింపులు తదిదర అంశాల్లో వారి అనుమతి లేకుండా కంప్యూటర్ ఆపరేటర్లు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అడుగు ముందుకు వేయడం అసాధ్యం. అలాంటిది మందడం లాంటి ఉదంతాలు ఏమైనా బైటపడినప్పుడు మాత్రం సీఆర్డీయే అధికారులు...దిగువస్థాయి సిబ్బందిని బోనులో నిలబెడుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. రిటర్నబుల్ ప్లాట్ల ప్రక్రియలో కంప్యూటర్ ఆపరేటర్ల పాత్ర పెద్దగా ఉండబోదనేది అక్కడ అందరికి తెలుసు...ఇటీవలి అక్రమ కౌలు కుంభకోణం, తాజా ల్యాండ్ స్కాం పాత్రధారుల చిరునామాలు గుంటూరు కు సంబంధించే ఉండటంతో ఎవరైనా అధికారి వెనక ఉండి ఈ కథ నడిపించాడేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications