అమరావతిలో కలకలం, 3 అడుగులు కుంగిన నేల, దెబ్బతిన్న సచివాలయ ఫ్లోరింగ్
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం పనుల్లో కలకలం రేగింది. సచివాలయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కొంతమేర నేల కుంగిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. మూడు అడుగుల వరకు నేల కుంగడంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతిన్నదని అంటున్నారు.
రుతు పవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో మట్టి బాగా నానిపోవడంతో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవంతి వద్ద నేల మూడు అడుగుల మేరకు కుంగిపోయిందని అంటున్నారు. రెండు బ్లాకులు దెబ్బతినడంతో.. నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని చెబుతున్నారు.
మంత్రులకు, ముఖ్య కార్యదర్శులకు కేటాయిస్తున్న బ్లాకు కుంగిపోయింది. దీంతో పనులు ఏ విధంగా కొనసాగించాలన్న విషయమై అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి, సమాలోచనలు జరుపుతున్నారు.
కాగా, ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 27 లోగా పనులు పూర్తి చేయాలన్న ఆదేశాలు ఉన్న కారణంగానే నాణ్యత లోపిస్తోందన్న విమర్శలూ ఉన్నాయి. తాత్కాలిక సచివాలయం పనులు హడావుడిగా చేస్తున్నారని అంటున్నారు. ఉద్యోగులు సమయం కోరినా ప్రభుత్వం ససేమీరా అన్న విషయం తెలిసిందే.
అవాస్తవం: సీఆర్డీఏ కమిషనర్
వెలగపూడి వద్ద నిర్మిస్తున్న ప్రభుతవ భవనాల కాంప్లెక్సు ప్రాంతంలో నేల కుంగినట్లు సాక్షి టీవీలో వచ్చిన ప్రసారంలో వాస్తవం లేదని సీఆర్డీఏ అదనపు కమిషనర్ డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు. నిర్మాణ పనులు చేపట్టే ముందుగానే సాయిల్ టెస్టింగ్ చేసి అనుకూలమైన చోటే పనులు చేపట్టామన్నారు.
రెండో బ్లాకులో ఫ్లోరింగ్ దెబ్బతిన్నదని, సాక్షి చానల్ ఇచ్చిన దాంట్లో ఎలాంటి నిజం లేదన్నారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ భవనాల కాంప్లెక్సులో ఎక్కడా నేల కుంగలేదన్నారు. కొత్తగా ఎటువంటి పనులు ప్రారంభం కాలేదన్నారు. లూజ్ సాయిల్ వల్ల అలా జరిగి ఉండవచ్చనే వాదనలు సరికాదని, సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవాలన్నారు.