విషాదం: ల్యాప్టాప్ పేలుడుతో తీవ్రగాయాలపాలైన మహిళా టెక్కీ మృతి
కడప: జిల్లాలోని కోడూరులో విషాదం నెలకొంది. గత కొద్ది రోజుల క్రితం ల్యాప్టాప్ పేలడంతో తీవ్రంగా గాయపడిన మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. చికిత్స కోలుకుంటుందని భావించినా.. ప్రాణాలు కోల్పోవడతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచే వర్క్ చేస్తుండగా.. ల్యాప్టాప్ పేలడంతో మేకవారిపల్లెకు చెందిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుమలత తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతి చెందింది. ఛార్జింగ్ పెట్టి వర్క్ చేస్తుండగా ల్యాప్టాప్ పేలిందని కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడు పలు సంస్థలు ఆఫీసులకు రావాలని పిలుస్తున్నాయి. మరికొన్ని మాత్రం తమ ఉద్యోగులతో ఇంకా ఇంటి నుంచే పనులు చేయిస్తున్నాయి. అయితే, కార్యాలయాల్లో పనికి అనుకూలంగా వాతావరణం ఉంటుంది. కానీ, పలు ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం, ఇతర వసతులు ఉండక ఉద్యోగులు కొంత ఇబ్బందులు పడుతున్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండటంతో ఎక్కువ మంది ఉద్యోగులు ల్యాప్టాప్కు ఛార్జింగ్ పెట్టి ఉంచే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ల్యాప్టాప్ పేలి 24 ఏళ్ల సుమలత తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లు పేలడం చూశాం కానీ, ల్యాప్టాప్ పేలడం అనేది ఇప్పటి వరకు చూడలేదని స్థానికులు చెబుతున్నారు.