యూపీలో బీజేపీ తాజా ప్రత్యర్థి యోగి: బీఎస్పీకి మైనారిటీ నేతలు కరువు
ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బిజెపికి సొంత పార్టీ నుంచే గడ్డు పరిస్థితులు ఎదురయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
లక్నో: ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బిజెపికి సొంత పార్టీ నుంచే గడ్డు పరిస్థితులు ఎదురయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన గోరఖ్ పూర్ ఎంపి యోగి ఆదిత్యానాథ్ స్థాపించిన హిందు యువ వాహని (హెచ్వైవి) తమ అధినేతను బిజెపి అవమానించిందని, కించ పరిచిందని ఆరోపిస్తున్నది.
అవసరమైనప్పుడు వాడుకుని, తీరిన తర్వాత వదిలేసిందని ఈ సంస్థ ప్రధాన ఆరోపణ. తాజాగా ఖుషీనగర్, మహారాజ్ గంజ్ జిల్లాల పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో 64 అసెంబ్లీ స్థానాలకు పైగా పోటీచేస్తామని కూడా ప్రకటించింది. కానీ దీనిపై స్పందించేందుకు యోగి ఆదిత్యానాథ్ నిరాకరించారు.
యోగి ఆధీనంలోనే ఖుషీ నగర్, మహారాజ్ గంజ్ జిల్లాలు
ఖుషీనగర్, మహారాజ్ గంజ్ జిల్లాలు పూర్తిగా యోగి ఆదిత్యానాథ్, ఆయన సారథ్యంలోని హిందు యువ వాహని కనుసన్నల్లో సాగుతున్నవే. 2002లో యోగి ఆదిత్యానాథ్ ఈ సంస్థను స్థాపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల పరిధిలో బిజెపికి కష్ట కాలమే. బిజెపి నాయకత్వం తమ అధినేతను సిఎం అభ్యర్థిగా ప్రకటించకుండా అవమాన పరిచిందని హెచ్వైవి నాయకులు చెప్తున్నారు. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని హెచ్ వైవి రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ సింగ్ చెప్పారు. పార్టీ నాయకత్వానికి యోగి ఆదిత్యానాథ్ 10 స్థానాలకు టిక్కెట్లు కేటాయించాలని ప్రతిపాదనలు సమర్పిస్తే కేవలం ఇద్దరి మాత్రమే సీట్లు ఇచ్చిందన్నారు. ఇక ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సునీల్ సింగ్. కానీ తాము బీజేపీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులను నిలుపుతామని స్పష్టం చేశారు.
పార్టీలో తమ అధినేతకు ప్రాధాన్యం లేదని హెచ్వైవి నిరసన
గత లోక్ సభ ఎన్నికల్లో గోరఖ్ పూర్ స్థానం నుంచి గెలుపొందితే మంత్రిగా స్థానం లభిస్తుందని తమను నమ్మించారని, కానీ అదేమీ జరుగలేదని హెచ్ వైవి శ్రేణులు చెప్తున్నారు. గత ఏడాది పరివర్తన యాత్ర విషయంలో బిజెపి నాయకత్వం నిర్లక్ష్యం చేసిందని ఆ సంస్థ విమర్శ. ఈ యాత్రలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, ఉమా భారతి, కల్ రాజ్ మిశ్రాలతోపాటు కేశవ్ ప్రసాద్ మౌర్యలకు కల్పించిన ప్రాధాన్యం తమ అధినాయకుడికి లభించలేదని హెచ్వైవీ ప్రధాన ఆరోపణ. తమ అధినేతను నిర్లక్ష్యం చేసినందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల యూనిట్లకు బీజేపీయేతర పార్టీలకు మద్దతునివ్వాలని కోరామని సునీల్ సింగ్ చెప్పారు.
నాయకుల వ్యక్తిత్వ ఆకాంక్షలు పట్టించుకోవద్దన్న బిజెపి
కానీ బిజెపి నాయకత్వం మాత్రం నాయకుల వ్యక్తిగత ఆకాంక్షలను పట్టించుకోవద్దని ఓటర్లను కోరుతోంది. తమ అభ్యర్థుల విజయంపై హెచ్ వైవీ అభ్యర్థుల పోటీ ప్రభావమేదీ ఉండదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రమోహన్ వ్యాఖ్యానించారు. ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికైన యోగి ఆదిత్యానాథ్ మాత్రమే గత లోక్సభ ఎన్నికల్లో ప్రస్తుత హోంమంత్రి - నాటి బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, ప్రధాని నరేంద్రమోదీలతోపాటు బిజెపి తరఫున ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంచేసిన నేతల్లో ఒకరు. గత ఎన్నికల్లో ప్రచారం కోసం బిజెపి నాయకత్వం యోగి ఆదిత్యానాథ్కు హెలికాప్టర్ సౌకర్యం కల్పించింది. హిందు, ముస్లిం ఓటర్లు గల ప్రాంతాల్లో ప్రచారంచేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారానికి కూడా యోగి ఆదిత్యానాథ్ నాయకత్వం వహించారు.
బీఎస్పీకి మైనారిటీ నేతల కొరత
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అదికారాన్ని కైవసంచేసుకొనే లక్ష్యంతో 99 స్థానాల్లో ముస్లింమైనారిటీ అభ్యర్థులను నిలిపిన బీఎస్పీ తరఫున ప్రచారంచేసే మైనారిటీ నేతల కొరత వేధిస్తున్నది. ఆ పార్టీ మీరట్ డివిజన్ కో ఆర్డినేటర్ హజీ సబీల్ స్పందిస్తూ తమ పార్టీ ఇతర పార్టీలతో పోలిస్తే క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా ప్రచారంచేస్తున్నామన్నారు. సమాజ్ వాదీ పార్టీ - కాంగ్రెస్ పార్టీ కూటమి మాదిరిగా శక్తిమంతంగా ప్రచారంచేసే నేతలే బీఎస్పీకి లేరు. రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్నారు. రెండు తొలి దశలో 140 స్థానాలకు 50 మంది ముస్లింల అభ్యర్థులను నిలిపింది బీఎస్పీ. ఆ పార్టీ ప్రకటించిన ప్రచారకర్తల జాబితాలో 40 మందికి ముగ్గురు మాత్రమే ముస్లిం నేతలు. పార్టీ ప్రధాన కార్యదర్శి నసీముద్దీన్ సిద్ధిఖీ, ఆయన కుమారుడు అఫ్జల్, ఆగ్రా, అలీగఢ్ డివిజన్ల పార్టీ సమన్వయకర్త సంషుద్దీన్ రయీమ్ మాత్రమే ప్రచార కర్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఎస్పీలో ఆజంఖాన్ సహా పలువురు ముస్లిం నేతలు
సమాజ్ వాదీ పార్టీ తరఫున ముస్లిం మైనారిటీలకు ప్రచారం చేసేందుకు రాష్ట్ర మంత్రులు ఆజంఖాన్, కమల్ అక్తర్, రాజ్యసభ సభ్యుడు జావేద్ అలీఖాన్, సీఎం అఖిలేశ్ యాదవ్ సన్నిహితుడు జావేద్ అబ్దీ, మంత్రి అహ్మద్ హసన్, మాజీ ఎమ్మెల్సీ ఖ్వాజా హలీం, ములాయం యూత్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ఎబాద్, ఎస్పీ మహారాష్ట్ర శాఖ చీఫ్ అబు అసిం అజ్మి ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ సారథ్యం
సమాజ్ వాదీ పార్టీ మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, షకీల్ అహ్మద్, జుబేర్ ఖాన్, షకీల్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ జహీర్ ఉన్నారు. గమ్మత్తేమిటంటే బీఎస్పీ ప్రచారకర్తల జాబితాలో పేరు దక్కించుకున్న ముగ్గురూ తమ ప్రాంతంలో మాత్రమే ప్రజాదరణ పొందిన వారని బీఎస్పీ నేతలు అంగీకరిస్తున్నారు.
బుందేల్ ఖండ్లో..
ముస్లింల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న బుందేల్ ఖండ్ రీజియన్లోని బండాలో సిద్ధిఖి, ఝాన్సీలో రయీన్ మాత్రమే ఆదరణ కలిగి ఉన్నారు. అయితే తాజాగా బీఎస్పీలో చేరిన ముక్తార్ అన్సారీ, ఆయన కొడుకు అబ్బాస్, అన్సారీ సోదరుడు సిబ్గాతులా పార్టీకి బలం కానున్నారు. అతి తక్కువ మంది నేతలు గల బీఎస్పీ.. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు మున్ ఖ్వాడ్ అలీ పేరు ప్రచారానికి ఉపయోగించుకోలేదు.