తెలంగాణలో పవర్ కట్: పోలీసు లాఠీఛార్జ్, తిరగబడ్డ రైతు
వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రైతుల ఆగ్రహం పట్టలేకపోయారు. వారు పోలీసుల పైకి ఎదురు తిరిగారు. రాళ్లు రువ్వారు.
తమకు విద్యుత్ ఇవ్వాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తే లాఠీఛార్జ్ చేయడమేమిటని నిలదీశారు. అక్కడే ఉన్న జీపును ధ్వంసం చేశారు. ఈ దాడిలో సీఐకి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాదు - నిజామాబాద్ మార్గంలో జాతీయ రహదారి పైన భారీగా ట్రాఫిక్ జాం అయింది.
విశాఖలో డీఆర్డీఏ కార్యాలయం ముట్టడి
విశాఖపట్నం జిల్లాలో ఐకేపీ మహిళలు డీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. మహిళలు లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.
రఘువీరా నిరసనలో కూలిన టెంట్
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద కాంగ్రెసు నేతలు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల హామీ మేరకు వెంటనే ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నిరసన కార్యక్రమంలో టెంట్ కూలి ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.