లక్ష్మీనారాయణ పొత్తు ఆయనతోనేనా..రాజకీయ లక్ష్యం ఎవరు..ఎవరి ఓట్లకు గండి..!!
సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ఖరారు అయింది. ఈనెల 26న కొత్త పార్టీ జెండా..అజెండా ప్రకటించనున్నారు . పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ..కో కన్వీనర్ గా జేఎన్టీయూ మాజీ వీసి రాజగోపాల్ వ్యవహరించనున్నారు. ఏపిలో లక్ష్మీ నారాయణ అందరికీ సుపరిచితుడే. సత్యం..జగన్ కేసుల ద్వారా ఆయన వెలుగులోకి వచ్చారు. ఇక, సర్వీసులో ఉన్న స మయంలోనే ఆయన బిజెపి లో చేరేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఏపి బిజెపి అధ్యక్షుడిగా నియమించేందుకు రంగం సిద్దమైంది. అయితే, కన్నా లక్ష్మీనారాయణ కు ఆ పదవి దక్కటంతో..బిజెపిలోకి ఎంట్రీ ఆగిపోయింది. ఆతరువాత ఆప్ ఏపి శాఖ బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది. కానీ, లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యారు.
లక్ష్మీనారాయణ అనూహ్య నిర్ణయం, 26న కొత్త పార్టీ: అందరికీ భిన్నంగా అవే కీలకం
సమయం లేదు...సామర్ధ్యం మాటేంటి
కొంత కాలంగా రాష్ట్ర పర్యటన చేసిన లక్ష్మీనారాయణ రైతులు..విద్యార్ధుల సమస్యల పై ప్రధానంగా ఫోకస్ చేసారు. ఇక, ఏపిలో మరో అయిదు..ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టి ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఇంత తక్కువ సమయంలో లక్ష్మీనారాయణ పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవటం అంత సులువైన విషయం కాదు. ఇక, పూర్తిగా రాజకీయాలకు కొత్త కావటంతో..ఎన్నికల వ్యూహాలను ఎదుర్కోవటం ఆ పార్టీ కి ఇబ్బంది కరంగా మారనుంది. అయితే, ఇవన్నీ తెలియకుండానే లక్ష్మీనారాయణ పార్టీ ఏర్పాటు చేయటం లేదు. లక్ష్మీ నారాయణ లక్ష్యం ఇప్పుడు ఎవరు...ఆయన పార్టీ ద్వారా ఏ పార్టీ ఓట్లకు గండి పడుతుందనే ఇప్పుడు చర్చ. లక్ష్మీ నారాయణ పార్టీ ఇప్పటికిప్పుడు ఒంటరిగా అన్ని స్థానాలకు పోటీ చేసే పరిస్థితి లేదు. పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఆయన కు ఉన్న ప్రత్యామ్నాయం ఒక్కటే. గతంలో జగన్ కేసుల విచారణ సమయంలోనే ఆయన టిడిపి నేతలతో సన్నిహిత సంబంధాలు నడిపారని..2014లోనే టిడిపి నుండి పోటీ చేయాలని భావించిన ఆ పార్టీ నేతల సూచన మేరకే పోటీ చేయలేదు. దీంతో..ఇప్పుడు లక్ష్మీ నారాయణ రాజకీయ సామర్ధ్యం పై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.
ఆయనతో పొత్తు తప్పదా..కలవాల్సిందేనా..
లక్ష్మీనారాయణ పార్టీ ఇప్పటికిప్పుడు సింగిల్ గా 175 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి ఉండదు. జనసేన లోనే ఇప్పటి వరకూ 175 స్థానాల్లో కన్వీనర్లు లేరు. ఇక, అధికారంలో ఉన్న టిడిపి తో కలిసి పొత్తు ఏర్పాటు చేసుకోవాలంటే ఇప్పటి కే కాంగ్రెస్ తో ఆ పార్టీ పొత్తు కుదుర్చుకొంది. ఏపిలో ఆ పొత్తు ఉంటుందా లేదా అనేది తెలంగాణ ఎన్నికల తరువాత మాత్రమే స్పష్టత రానుంది. అయితే, అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకొనే అవకాశాలు చాలా తక్కువ. జగన్ కేసు ల విచారణ సమయంలో జెడి లక్ష్మీనారాయణ పై అప్పట్లోనే వైసిపి నేతలు విమర్శలు చేసేవారు. టిడిపి- కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక, ఇప్పుడు అదే కూటమి లో చేరితే రాజకీయంగా పూర్తి స్థాయిలో నష్టపోయే అకవాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ తో కలిసే పరిస్థితి ఉండదు. లక్ష్మీ నారయణ పై వైసిపి శ్రేణులు అంతగా ఆగ్రహంతో ఉంటాయి. ఇక, మిగిలింది...వపన్ కళ్యాన్- కమ్యూనిస్టుల కూటమి. వారితో కలిసి లక్ష్మీ నారాయణ రాజకీయ ప్రయాణం సాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బిజెపి ఏపిలో కొత్త పార్టీలు ఏర్పాటు చేయించి..టిడిపి ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు టిడిపి నుండి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ - వామపక్షాల కూటమి మాత్రమే లక్ష్మీనారయణకు ఉన్న ప్రత్యామ్నాయం. నిజాయితీ కలిగిన అధికారిగా కొన్ని వర్గాల ప్రజల్లో ఉన్న ఇమేజ్ తమకు సహకరించే అవకాశం ఉండటంతో సమీకరణాలు కలిసే అవకాశం ఉంది.
ఓట్లు చీల్చే శక్తి ఉందా..ఎవరి ఓట్లకు గండి..
లక్ష్మీ నారాయణ పార్టీ స్వతంత్రంగా రాజకీయంగా శక్తి చాటుకొనే పరిస్థితులు తక్కువగానే కనిపిస్తున్నాయి. పవన్ కూటమి తో కలిసినా..ఒంటరిగా పోటీ చేసినా...ఎక్కువగా విద్యా వంతులు..యువత లక్ష్మీనారాయణ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ఎంతో కాలంగా జగన్ అభిమానులు మాత్రం లక్ష్మీనారాయణ పై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటంతో..ఆయన పై వైసిపి ఏ అవకాశాన్ని విడవకుండా విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది. గ్రామీణ స్థాయిలో ఆయన ప్రభావం అంతగా ఉండే పరిస్థితి లేదు. ఇక, అర్బన్ లో ఆయనకు పడే ఓట్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్ల చీలిక కోసమే ఆయన్ను కొందరు తెర వెనుక ఉండి పార్టీ స్థాపన దిశగా పావులు కదిపారని టిడిపి నేతలు అంతర్గత చర్చల్లో చెబుతున్న మాట. కొద్ది రోజులు క్రితం ఎంపి కొత్తపల్లి గీత సైతం కొత్త పార్టీ ఏర్పాటు చేసారు. ఆ తరువాత ఇప్పటి వరకు ప్రజల్లోకి రాలేదు. టిడిపి నేతలతో ఇప్పటికీ లక్ష్మీనారయణ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది వైసిపి నేతల ఆరోపణ. మరి..లక్ష్మీనారాయణ రాజకీయంగా తన అడుగులు ఎటువైపు ఉంటాయో... ఏ మేరకు ప్రభావం చూపుతారో రానున్న రోజుల్లో చూడాల్సిందే...