రైతుల వలసలు బాబు వైఫల్యం: సీమ 'బంద్'లో రోడ్డెక్కిన వామపక్షాలు..
రాయలసీమను కరువు నుంచి గట్టెక్కించేందుకు సీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. అలాగే అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ రుణాలు మంజూరు చేయాలన్నారు.
అనంతపురం: కరువు సీమను పచ్చగా మారుస్తామని హామి ఇచ్చిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ వామపక్షాలు రోడ్డెక్కాయి. కరువు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం నాడు రాయలసీమ బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ కు కాంగ్రెస్ మద్దతు కూడా తోడవడంతో.. నాలుగు జిల్లాల్లోను బంద్ ప్రభావం కనిపిస్తోంది.
బంద్ నేపథ్యంలో.. నాలుగు జిల్లాల్లోను వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు కలిసి ఆందోళనకు దిగారు. పలు డిపోల్లో బస్సులను కదలనివ్వకుండా వామపక్ష కార్యకర్తలు బైఠాయించారు. బంద్ కారణంగా అనంతపురం జేఎన్టీయూ పరిధిలో బుధవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
మరోవైపు అనంతపురంలో వామపక్ష నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బస్సులను అడ్డుకోవడంతో.. పోలీసులకు-వామపక్షాలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పలువురు వామపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బంద్లో పాల్గొన్న పలువురు రైతులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామి పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీ చాలని కూలీ వేతనాలతో రాష్ట్రంలో రైతులంతా వలస వెళ్లిపోయే పరిస్థితి తలెత్తిందని వాపోయారు.
రాయలసీమను కరువు నుంచి గట్టెక్కించేందుకు సీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. అలాగే అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ రుణాలు మంజూరు చేయాలన్నారు. తిరుపతిలో బస్సులను అడ్డుకున్న వామపక్ష, కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది.