'మంత్రులనూ చీపుర్లతో కొట్టండి', వాటర్ గ్రిడ్ పేరిట... తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఆందోళన
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ అంటూ మంత్రులు, అధికారులు ఎవరు వచ్చినా చీపుర్లతో తరిమి కొట్టాలని రైతులకు, స్థానిక ప్రజలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంగళవారం సూచించారు.
విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. భోగాపురంలో ఈ రోజు పది వామక్షాలు నిర్వహించిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడారు.
భూసేకరణ విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయం భూసేకరణ కోసం మంత్రులు, అధికారులు ఎవరు వచ్చినా చీపుర్లతో తరిమికొట్టాలన్నారు. అసెంబ్లీ, రాష్ట్ర బంద్ కు భోగాపురం మండల ప్రజలు సిద్ధం కావాలన్నారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఈ బహిరంగ సభకు హాజరయ్యారు. రైతులు ఎన్ని ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వ ధోరణి మారటం లేదన్నారు. నోటిఫికేషన్ విడుదల చేస్తే తన భూమి కోల్పోవాల్సి వస్తుందని భయపడి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు
రాష్ట్ర విభజన తర్వాత మార్గదర్శకాలకు విరుద్ధంగా కృష్ణా నది పైన తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వాటిని అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే జూరాల, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలపై ఫిర్యాదు చేసింది.
ఇప్పుడు అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా దాదాపు పదకొండు ప్రాజెక్టులు నిర్మించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైందని పేర్కొంటూ బోర్డుకు లేఖ రాసింది. కొత్త ఆయకట్టుకు సాగునీటి కోసం, గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు వాటర్ గ్రిడ్ పేరిట కృష్ణా నీటిని విచ్చలవిడిగా వాడేందుకు తెలంగాణ సిద్ధమౌతోందని, దీనిని అడ్డుకోవాలని ఆ నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాలని బోర్డును ఏపీ కోరింది.
ఈ నిర్మాణాలను ప్రోత్సహిస్తే ఏపీ నీటి ఎద్దడి ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా పైన 11 చోట్ల, గోదావరి నదిపై 15 ప్రదేశాల్లో అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా కట్టడాలని చేపడుతోందని, మొత్తానికి కృష్ణా పరివాహక ప్రాంతంలో అక్రమంగా 19.59 టీఎంసీల నీటిని వాడుకునేందుకు సన్నద్ధమైందని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications