'జగన్ను ఎక్కువగా పొగుడుతోంది వాళ్లే, వైసీపీ అమ్ముల పొదిలో అస్త్రాలు'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కమ్యూనిస్టులే ఎక్కువగా పొగుడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య మంగళవారం నాడు విమర్శించారు. వామపక్షాలు వైసిపికి తోక పార్టీలుగా మారాయని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మౌత్ పీస్గా మారిందన్నారు. ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, సీనియర్ నేతలు సీ రామచంద్రయ్య, ఉండవల్లి అరుణ్ కుమార్లు వైయస్ జగన్ అమ్ముల పొదిలో అస్త్రాలుగా మారారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, వైసిపి తోడుదొంగలు: గాలి
రాష్ట్రంలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు ఇచ్చిన ఘనుడు రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్, వైసిపి విమర్శలను ప్రజలు పట్టించుకునే స్థితిలే లేరన్నారు.