జగన్ నాపై అసత్య ఆరోపణలు...చట్టపరమైన చర్యలు: ఎంపి మురళీమోహన్;చిచ్చు పెట్టిన కేశినేని
విజయవాడ:వైసిపి అధినేత జగన్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ హెచ్చరించారు. జగన్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అయినా 18 నెలలు జైలులో గడిపి వచ్చిన జగన్కు, అసలు తన గురించి మాట్లాడే అర్హత లేదని ఎంపి మురళీ మోహన్ వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్ కూడా ఇలాగే తనపై పలు అసత్య ఆరోపణలు చేసినా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని మురళీ మోహన్ గుర్తు చేశారు. అలీఫ్ అనే ఒక సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తోందని, ప్రభుత్వం దానికి భూమి కేటాయిస్తే ఆ విషయం తనకేం సంబంధమని మురళీమోహన్ ప్రశ్నించారు.
మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎ.కొండూరు పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు స్థానిక టీడీపీ నేతల్లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమనేలా చేశాయి. ఎంపీ నాని వ్యాఖ్యలకు మనస్థాపం చెందిన పలువురు స్థానిక నేతలు రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎంపి నాని ఏమన్నారంటే... ఎ.కొండూరులో పార్టీ మండలస్థాయి సమావేశంలో పాల్గొన్న నానిని తిరువూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఈసారి ఎ.కొండూరుకు కేటాయించాలని పలువురు స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు కోరారు.

దీంతో ఆయన ఈ మండలంలో టీడీపీకి మెజార్టీ ఎంత వస్తుంది అని అడిగారు. 300 నుంచి 400 వరకు వస్తుందని చెప్పారు. సుమారు 10 వేలు మెజార్టీ తీసుకువస్తేనే ఎ.కొండూరుకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇస్తానని తేల్చిచెప్పారట. దీంతో ఖంగుతిన్న అక్కడి నేతలు ఎంపీ పర్యటన అనంతరం మళ్లీ సమావేశమై మంత్రి కావాలనే తమకు అలాంటి టార్గెట్ పెట్టారని, లేకుంటే ఏకంగా ఇక్కడ 10 వేలు మెజార్టీ ఎలా సాధ్యపడుతుందని మధనపడ్డారట. మండల అధ్యక్షుడికి అలవిగాని టార్గెట్ ఇచ్చి అతడిని అసమర్ధుడుగా చేసేలా ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయి కనుక వెంటనే రాజీనామా చేయాలని రమేష్రెడ్డిపై స్థానిక నేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చారట.
దీంతో రమేష్ రెడ్డి కూడా రాజీనామా చేద్దామనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మూడు సార్లు మండల అధ్యక్షునిగా పని చేసి రెండు సార్లు ఎ.కొండూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని టీడీపీ కైవసం చేసుకునేలా సఫలీకృతమైన రమేష్రెడ్డి రాజీనామా చేస్తే ఆయన వెంట మరి కొంత మంది రాజీనామా బాట పడతారని భావిస్తున్నారు. మొత్తం మీద ఎంపీ మాటలు ఎ.కొండూరులో చిచ్చు పెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు.












Click it and Unblock the Notifications