పవన్కు సొంత సామాజిక వర్గం మద్దతు లేదా!: ఆంధ్రజ్యోతి సర్వేలో ఏం తేలిందంటే!
తన సొంత సామాజిక వర్గమైన కాపుల్లో పవన్ కళ్యాణ్కు అంతగా మద్దతు లేదని ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ సర్వే పేర్కొనడం ప్రస్తుతం ఏపీ అంతటా చర్చనీయాంశంగా మారింది.
విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా యాక్టివ్ అవడం.. భవిష్యత్తులో ఏ పార్టీకి నష్టాన్ని మిగులుస్తుందన్న చర్చల నేపథ్యంలో.. అసలు పవన్ కళ్యాణ్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ఉండబోదని ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ సర్వే వెల్లడించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజాగా ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ఆయా సామాజిక వర్గాల్లో ఎంతమేర మద్దతు ఉందనే విషయాన్ని వెల్లడిస్తూ.. ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. ఫ్లాష్ టీమ్ నిర్వహించిన సర్వే ఆధారంగా టీడీపీ, వైసీపీల సామర్థ్యాన్ని అంచనా వేసింది. మొత్తంగా అన్ని సామాజిక వర్గాల్లోను టీడీపీ పైచేయి కనబరుస్తుందని.. ఒక్క ఎస్సీ సామాజికవర్గంలోనే వైసీపీకి అత్యధిక పట్టు ఉందని సర్వే తేల్చింది.
పవన్ కళ్యాణ్ ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు
కాగా, తన సొంత సామాజిక వర్గమైన కాపుల్లో పవన్ కళ్యాణ్ కు అంతగా మద్దతు లేదని సర్వే పేర్కొనడం ప్రస్తుతం ఏపీ అంతటా చర్చనీయాంశంగా మారింది. కోస్తాలో చాలాచోట్ల జనసేనకు ఐదు శాతానికి మించి కాపుల మద్దతు లేదని సర్వే తేల్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లోను జనసేనకు అంతగా పట్టులేదని, తూర్పు గోదావరితో పోలిస్తే పశ్చిమ గోదావరిలోని ఉంగుటూరు నియోజకవర్గంలో 5.75 శాతం మంది స్వల్ప మద్దతు మాత్రమే జనసేనకే దక్కిందని సర్వే వెల్లడించింది.
కోస్తాంధ్ర వ్యాప్తంగా జనసేనకు అత్యధిక మద్దతు లభించింది కైకలూరు నియోజకవర్గంలోనే. ఆ ప్రాంతంలో 8.7శాతం మంది జనసేనకు మద్దతుగా నిలిచారు. కాగా, కోస్తాతో పోలిస్తే రాయలసీమలోనే జనసేనకు అధిక మద్దతు లభించడం గమనార్హం. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టులో 16 శాతం, అనంతపురంలో 15 శాతం మంది జనసేనకు మద్దతు తెలిపినట్టుగా సర్వే ద్వారా వెల్లడైంది.
రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు చిత్తూరు జిల్లా పీలేరు కాపు సామాజిక వర్గంలో అత్యధికంగా 47శాతం మద్దతు లభించింది. ఇదే నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం నుంచి కూడా 3శాతం మంది పవన్ కళ్యాణ్ జనసేనకు మద్దతుగా నిలవడం విశేషం. మొత్తంగా ఒక్క పీలేరు మినహా రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు కాపు సామాజిక వర్గం మద్దతుగా అంతగా లేదని ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ సర్వే తేల్చింది.