ఎమ్మెల్యే శ్రీదేవితో మాకు ప్రాణహాని... సీఎం జగనే మమ్మల్ని కాపాడాలి : వైసీపీ బహిష్కృత నేత
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే,బహిష్కృత నేతల మధ్య వైరం ముదురుతోంది. పార్టీ బహిష్కృత నేతలతో తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది గంటలకే... తమకే ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని ఆ నేతలు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి అక్రమ కేసులతో తమను వేధిస్తున్నారని... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే తమను కాపాడాలని వైసీపీ బహిష్కృత నేత శృంగారపాటి సందీప్ ఆ వీడియోలో ఆరోపించారు. శనివారం(నవంబర్ 7) వెలుగుచూసిన ఆ వీడియో తాడికొండ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
ఆ ఇద్దరితో నాకు ప్రాణహాని... వెంటపడుతూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు... : వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి
రెండు రోజుల క్రితం వైసీపీ బహిష్కృత నేతలు శృంగారపాటి సందీప్,చలివేంద్ర సురేష్ గుంటూరులో ప్రెస్మీట్ పెట్టి ఎమ్మెల్యే శ్రీదేవిపై పలు ఆరోపణలు చేశారు. మరుసటిరోజు శుక్రవారం(నవంబర్ 6) ఆ ఇద్దరిపై ఎమ్మెల్యే శ్రీదేవి నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించడానికి తానే కారణమని భావించి తనపై బ్లాక్మెయిల్,బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను బయటకు వెళ్లినప్పుడు తనను వెంబడిస్తూ ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు సందీప్,చలివేంద్ర సురేష్లపై కేసు నమోదు చేశారు.అయితే శ్రీదేవే వల్లే తమకు ప్రాణహాని ఉందని... అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని సందీప్ తాజా సెల్ఫీ వీడియోలో ఆరోపించడంతో అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది.
ఎమ్మెల్యే శ్రీదేవి గెలిచింది మొదటిసారే అయినప్పటికీ వరుస వివాదాలతో ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ముఖ్యంగా తాడికొండలో పేకాట క్లబ్ వ్యవహారంలో ఆమెపై వచ్చిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. అయితే ఆ ఆరోపణలను శ్రీదేవి గతంలోనే ఖండించారు. ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యేగా,డాక్టరుగా ఉండి... ఇలా పేకాట క్లబ్ నిర్వహించాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అసలు పేకాట జరుగుతున్న నంబూరు గ్రామానికి తన నియోజకవర్గంతో సంబంధం లేదన్నారు.తనపై అసత్య కథనాలు ప్రచారం చేసే మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మహిళా నేతను అణిచివేసే ధోరణి కాకుండా నిజాలు, ప్రజలకు చేరవేయాలని ఎమ్మెల్యే శ్రీదేవి హితవు పలికారు.